అగ్నిపథ్ పథకం దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆర్మీ అభ్యర్ధులు భారీగా ప్రభుత్వ ఆస్తి నష్టం చేశారు. విద్యార్ధలు నిరసనలతో దేశవ్యాప్తంగా విధ్యంస వాతావరణం ఏర్పడింది. అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన విధ్వంసంపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుట్టారు. పలువుర్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మిగతావారినీ గుర్తించేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు.
ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ ఘటనపై కేంద్ర నిఘా సంస్థలు దృష్టి సారించాయి. దీనిపై లోతుగా ఆరా తీస్తున్నాయి. విధ్వంసానికి నిర్దుష్ట కారణాలను తెలుసుకోవడంతో పాటు ఇందుకు బాధ్యులు, ఆందోళనలో పాల్గొన్నవారిని గుర్తించేందుకు కేంద్ర నిఘా సంస్థతో పాటు రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నిఘా విభాగాలు రంగంలోకి దిగాయి.
మరోవైపు ఈ ఘటనపై రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుండటంతో వాటిపైనా కేంద్ర నిఘా సంస్థ ఆరా తీస్తోంది. పోలీసులు, రైల్వేశాఖ ప్రతినిధులు సమాచారం సేకరిస్తున్నారు. రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని నిఘా విభాగానికి చెందిన ప్రతినిధులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చినట్లు సమాచారం. ఘటనలో జాతి వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందా..? అన్న కోణంలో వారు ఆరా తీస్తున్నారు.
విధ్వంసానికి పాల్పడ్డవారిని సైనిక దళాల్లో తీసుకోకూడదని అధికారులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. వీరిని గుర్తించేందుకు అరెస్ట్ అయిన వారి వివరాలు.. దర్యాప్తు సందర్భంగా వారు వెల్లడించిన అంశాలతో పాటు సీసీ కెమెరా దృశ్యాలు, వివిధ మీడియాల్లో ప్రచురితమైన ఫొటోలు, సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన దృశ్యాలను నిఘా విభాగం ప్రతినిధులు సేకరిస్తున్నారు. ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదని నిఘా సంస్థ స్పష్టం చేసింది.