సహజంగా ఏవైనా ఎన్నికలు వస్తే రెండు మూడు నెలల ముందునుండే పార్టీ అభ్యర్ధులు, కార్యకర్తలు ఇళ్లిళ్లు తిరిగి ప్రచారం చేస్తుంటారు. ఇగ ఎన్నికలు ముగిసే వరకు సుక్క ముక్కలతో ఆ ప్రాంతం అంతా పండగ వాతావరణం ఏర్పడుతోంది. చివరకు ప్రజలు ఓట్లేసి తమకు కావలసిన నాయకున్ని ఎన్నుకుంటారు. అభ్యర్థి గురించి తెలిసినా తెలియకపోయినా.. పార్టీని చూసి ఓటేస్తుంటారు. కానీ.. ఓ గ్రామంలో సర్పంచ్ ఎన్నికలకు పోటీ చేసే సర్పంచ్ అభ్యర్థికి రాతపరీక్ష, ప్రసంగ పరీక్ష పెట్టి అందులో ఉత్తమమైన వ్యక్తిని ఎంపిక చేస్తున్నారు. ఒడిశాలోని సందర్ గఢ్ జిల్లాలోని కుటరా గ్రామంలో జరిగిందీ ఆసక్తికర పరిణామం.
ఈ నెల 16 నుంచి ఒడిశాలో పంచాయతీ ఎన్నికలు మొదలు కానున్నాయి. ఐదు దశల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో కుటరా గ్రామానికి 18న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే సర్పంచ్ పదవి కోసం పోటీ పడుతున్న వారికి గ్రామస్థులు రాతపరీక్ష పెడుతున్నారు. గత గురువారం నిర్వహించిన ఈ పరిక్షకు 8 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆ ఫలితాలను గ్రామస్థుల ముందు ఉంచుతారు. ఆ ఫలితాల ఆధారంగా మంచి వ్యక్తికి జనాలు ఓటేసేలా చూస్తున్నారు.
ఆదంతా అదే గ్రామానికి చెందిన.. డిగ్రీ డ్రాపౌట్ అయిన ప్రదీప్ లక్రా (38) అనే రైతు ఆలోచన. పరీక్షకు వారం ముందే సర్పంచ్ అభ్యర్థులందరికీ సమాచారం ఇస్తామని ఆయన తెలిపారు. 9 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నా 8 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని అన్నారు. ఒకరి తర్వాత ఒకరికి ప్రాథమిక పాఠశాల ఆవరణలో పరీక్షను నిర్వహించామని చెప్పారు. మరో అభ్యర్థి పెళ్లి ఉందని చెప్పి రాలేకపోయారని తెలిపారు.
పరీక్షలో భాగంగా ఏడు ప్రశ్నలు ఇచ్చామని అన్నారు. అరగంటలో వాటన్నింటికీ జవాబులు రాసేలా టైం పెట్టామని ఆయన చెప్పారు. ఇచ్చిన ప్రశ్నలకు తొలి పావుగంటలో ప్రసంగం ద్వారా.. ఆ తర్వాత పావుగంటలో లిఖితపూర్వకంగా సమాధానాలను చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షలో పాస్, ఫెయిల్ అన్నదేంలేదని, అభ్యర్థి ఎలాంటివాడు అని తెలుసుకొనేందుకే ఈ పరీక్షను పెడుతున్నామని గ్రామస్థులు చెప్తున్నారు. తమ నేత ఎలాంటివాడో తెలుసుకునే హక్కు ఓటర్లకుంటుందని లలితా బరువా (42) అనే మహిళా అభ్యర్థి స్పష్టం చేశారు. కాగా.. కుటరా గ్రామంలో 16 వార్డులకు గానూ 5,500 మంది ఓటర్లున్నారు.