సుప్రసిద్ధ పత్రికా సంపాదకుడు డాక్టర్ ఏబీకే ప్రసాద్ కు అరుదైన గౌరవం దక్కింది. జర్నలిజం రంగంలో అత్యుత్తమ సేవలు అందించినందుకు డాక్టర్ ఏబీకే ప్రసాద్ ను ప్రతిష్టాత్మకమైన ‘రాజా రామ్మోహన్ రాయ్’ అవార్డుకు ఎంపిక చేసినట్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్ శ్రీమతి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలోని కమిటీ ఈ అవార్డును ప్రకటించింది. పాత్రికేయ రంగంలో 75 సంవత్సరాల సుదీర్ఘ అనుభవాన్ని కలిగి ఉన్న వ్యక్తిగానూ ఏబీకే అరుదైన గౌరవం దక్కించుకున్నారు.
ఇదిలా ఉండగా డాక్టర్ అన్నె భవానీ కోటేశ్వర ప్రసాద్ ఏబీకేగా ప్రసిద్ధి చెందారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెలువడిన ప్రధాన పత్రికలకు ఆయన సంపాదకులుగా పనిచేశారు. 2004-09 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షులుగా కూడా ఏబీకే పనిచేశారు.
ఫిబ్రవరి 28న న్యూఢిల్లీలో డిప్యూటీ స్పీకర్ హాల్, కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా రఫీ మార్గ్ లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు ప్రదానోత్సవం జరగనుంది.