అన్న ఎన్టీఆర్ గారు.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఆయన తెర మీద ఎన్నో రకాల పాత్రలు వేశారు. తరువాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఆఖండ విజయాన్ని సాధించి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి చేపట్టారు.
రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆయన సీరియస్ గా ఉండేవారు కానీ..దానికి ముందు సినీ రంగంలో ఆయన చాలా సరదాగా కనిపించేవారు. ఎలాంటి భేషజాలు లేకుండా అందరినీ కలుపుకొనిపోయేవారు. లైట్ బాయ్ నుంచి మేకప్ వరకు…దర్శకుడి నుంచి నిర్మాత వరకు .. ఎవరికి ఇచ్చే గౌరవం వారికి ఇచ్చేవారు. అంతేకాదు.. అందరితోనూ కలివిడిగా ఉండేవారు. ఎక్కువగా అందరితోనూ కలిసే భోజనం చేసేవారు.
అదే సమయంలో ఆయన తన అభిరుచులకు తగిన విధంగా వండించుకునే ఆహార పదార్థాలను కూడా అందరితోనూ కలిసే పంచుకునేవారు. “నాకోసం.. నీ కోసం.. ఏమిటోయ్! అందరూ తినొచ్చు రా!! తిందాం“ అంటూ.. యూనిట్లో అందరినీ కలుపుకొని కూర్చుని తినేవారు. సాధారణంగా పెద్ద హీరో అనగానే.. ప్రత్యేకంగా డైనింగ్ ఏర్పాట్లు చేస్తారు. స్టార్ హోటల్ నుంచి ఆహారం తీసుకువస్తారు. ఇది అన్నగారి హయాంలోనూ ఉంది.
అయితే.. అన్నగారు.. పక్కా మాస్. పైగా పల్లెటూరు నుంచి వచ్చిన రైతు బిడ్డ. దీంతో ఆయన ఇలాంటి వాటిని ఇష్టపడే వారుకాదు. “మనిషన్నాక.. కలివిడి ఉండాలోయ్.. నేనొక్కడినీ కూర్చుని తింటే.. రుచి కూడా తెలీదు.“ అని తరచుగా తనతో అనేవారని.. గుమ్మడి వెంకటేశ్వరరావు.. తన పుస్తకంలో రాసుకున్నారు. ఇలా.. ఎస్వీ రంగారావు.. గుమ్మడి, ప్రభాకర్రెడ్డి, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య, రాఘవేంద్రరావు.. అందరితోనూ.. అన్నగారు వంటకాలను పంచుకునేవారు.
ఇక, ముఖ్యంగా అన్నగారికి ఇష్టమైన వెజ్ పచ్చళ్లలో ఆవకాయ కన్నా.. మాగాయను ఎక్కువగా ఇష్టపడేవా రు. నిమ్మకూరులో ఉండే.. అన్నగారి పిన్ని.. ఆయన కోసం.. మామిడి కాయలు రాగానే.. మాగాయ పచ్చడిని పట్టి.. ప్రత్యేకంగా ప్యాక్ చేసి.. చెన్నైకి పంపించేవారు. ఇక, ఈ మాగాయ్ కోసం.. అన్నగారు కూడా వెయ్యికళ్లతో వేచి చూసేవారు. మాగాయ్అందడమే ఆలస్యం.. అదే కూర, అదే పచ్చడి.. అదే రసం.. అన్నట్టుగా దాంతోనే లాగించేవారు. తన చుట్టూ ఉన్నవారికి పంచేవారు. `మా ఊరి మాగాయ్“ తినాల్సిందే అంటూ.. సావిత్రి, భానుమతి..ఎల్లార్ ఈశ్వరి వంటివారికి ప్రత్యేకంగా రుచి చూపించేవారు. ఇదీ.. అన్నగారి ఆత్మీయత.