సందు దొరికితే చాలు దూరిపోయి.. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబంపై నిప్పులు చెరిగే తీన్మార్ మల్లన్న.. మంగమ్మ శపథం చేశారు. ఇక నుండి కేసీఆర్ పై పళ్లెత్తు మాట కూడా ఎత్తనని ఒట్టేసి చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో నిర్వహించిన ‘7200 మూవ్మెంట్’ సన్నాహక సమావేశానికి హాజరైన ఆయన మల్లన్న.. ఇకపై కేసీఆర్ ను తిట్టబోనని చెప్పారు.
ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడీ రాజ్యం పోయే వరకు ‘7200 మూవ్మెంట్’ ద్వారా పోరాడతానని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడమే తన విధానం కాదని వివరించారు. గొప్పోళ్ల, పేదోళ్ల బిడ్డలు ఒకే పాఠశాలలో చదవాలన్నదే తన ఉద్యమ లక్ష్యమని అన్నారు మల్లన్న.
విద్యావంతులైన బాల్క సుమన్, గాదరి కిషోర్ లకు విద్యాశాఖ అప్పగిస్తే బాగుంటుందని మల్లన్న అభిప్రాయపడ్డారు. యాదాద్రిలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి చేసిన అభివృద్ధి ఒక్క గాలి వానకే తుడిచిపెట్టుకుపోయిందని ఎద్దేవా చేశారు.
అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ ను విడిచి బయటకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. తమ ఆస్తులను ప్రభుత్వానికి రాసి ఇచ్చేసి జూన్ రెండో వారం నుంచి చేపట్టనున్న ప్రజాపాదయాత్రలో పాల్గొంటామని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.