– లక్ష్మీ నారాయణ.. పెద్ద మేనేజ్ మాస్టర్!
– ఎదురొచ్చినోడికి డబ్బులతోనే ఆన్సర్
– కాస్ట్లీ ఫంక్షన్లు.. విందులు, వినోదాలు
– మధ్యలో నిర్మాతగా అవతారం
– తెరపైకి మాదకద్రవ్యాల లింక్స్!
– జగపతి బాబుకి సైతం మాయమాటలు
– బూదాటి అంటే పోలీసులకు పండగే..!
క్రైంబ్యూరో, తొలివెలుగు:మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు సొంతిల్లు ఇస్తామని చెప్పి.. 3 వేల కుటుంబాల సొమ్మంతా దోచుకున్నాడు లక్ష్మీ నారాయణ. అందినకాడికి అంతా లాగేశాడు. ఈక్రమంలోనే ఓ మహిళా ఎమ్మెల్సీకి 7 కోట్లు, మాజీ మంత్రికి 2 కోట్లు, స్థానిక ఎమ్మెల్యేలకు ప్లాట్స్, కోటి రూపాయల వరకు ముట్టజెప్పారని వినికిడి. టీటీడీ సభ్యత్వం కోసం 10 కోట్లు, విశాఖ స్వామీజీకి హైదరాబాద్ లో ప్రత్యేకంగా అశ్రమం నిర్మిస్తామని హామీ ఇచ్చారట. అయితే.. ఇంతటితో అయిపోలేదని అంటున్నాయి దర్యాప్తు సంస్థలు. ఎవరెవరిని ఎలా వాడుకున్నారో.. డబ్బులు ఎలా ఖర్చు చేశారో.. వాటన్నింటినీ రికవరీ ఎలా చేయాలో అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం.
కాకతీయ హిల్స్ లో కబ్జా!
కాకతీయ పనోరమ పేరుతో ఆపార్ట్ మెంట్స్ నిర్మాణం చేపట్టారు. తమ భూమి కాకుండానే దొంగ పత్రాలతో కబ్జా చేసుకున్నారు. ప్లాట్ ఓనర్స్ కి పై ఫ్లాట్స్ ఇస్తామని ఒప్పించారు. రోడ్లు, పార్క్ స్థలాన్ని కబ్జా చేసి.. అక్రమంగా అనుమతులు తెచ్చుకున్నారు. అందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో 2 కోట్లకు మాట్లాడుకుని కోటి ఇచ్చారనే ప్రచారం ఉంది. అలాగే మేయర్ బొంతు రామ్మోహన్ కి కోటి, తన సన్నిహితుడైన కిశోర్ కి 2వేల స్క్వేర్ ఫీట్ చొప్పున ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ దేవేందర్ రెడ్డి అనుమతులు ఇచ్చేలా పావులు కదిపారు. అక్కడ పనిచేసిన అప్పటి సీఐకి కేసులు కాకుండా రూ.50 లక్షల లంచం ఇచ్చారని సమాచారం. అదే డబ్బును ఎలాగైనా తీసుకోవాలని, పనోరమలో ఫ్లాట్ కొనుగోలు చేయాలని డబ్బులు వెనక్కి తీసుకున్నారంటే వీరి లాబీయింగ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అధికారులకు లంచాలు ఇచ్చారు. ఇదే కాకుండా ఫేక్ డాక్యుమెంట్స్ అని తెలిసినా.. దొంగ యూఎల్సీ సర్టిఫికెట్స్ సృష్టించి కలెక్టర్స్ ముద్రలు తయారు చేస్తున్నారని కళ్ల ముందు కనిపించినా.. గులాబీ నోట్ల మత్తులో ఎవరికీ ఏవీ కనిపించలేదు. ఫేక్ తయారీ ముఠా వ్యవహారంలో ఎవరి పాత్ర ఏంటో పేర్లతో సహా మరో కథనంలో తొలివెలుగు బయటపెడుతుంది.
అమ్మాయిల కోసమే స్పై సినిమా?
సీరియల్ నటుడు సాగర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. ఈజీగా వచ్చిన సొమ్ముతో స్పై అనే సినిమాని నిర్మించే ప్రయత్నం చేశాడు లక్ష్మీ నారాయణ. అక్కడ కోటిన్నర పెట్టుబడులు పెట్టాడు. వారణాసిలో షూటింగ్ కోసం స్పెషల్ ప్లైట్స్ లో తండ్రీకుమారులు వెళ్లేవారు. హీరోయిన్స్ వారనుకున్నట్లుగా సహకరించకపోవడంతో సినిమానే మధ్యలో వదిలేశారని సినీ వర్గాల్లో ఓ చర్చ ఉంది. ఈ సినిమాని డైరెక్టర్ రమేష్ దేశాని, స్క్రిప్ట్ డీవీఎస్ రవితో మేకింగ్ చేసి వదిలేశారు.
లాక్ డౌన్ లో మొయినాబాద్ ఫాంహౌజ్!
సాహితీ మరో డైరెక్టర్ ఆంటోనీ రెడ్డికి చెందిన ఫాంహౌజ్ మొయినాబాద్ లో ఉంది. లాక్ డౌన్ టైంలో రేవ్ పార్టీలతో ఎంజాయ్ చేశారని ఎస్ఓటీ పోలీసులకు సమాచారం ఉండేది. కానీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల సహకారం పూర్తిగా ఉండటంతో రెయిడ్స్ చేయలేకపోయారు. గత రెండేళ్లుగా వస్తున్న టెన్షన్స్ భరించలేక.. మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు అభియోగాలు ఉన్నాయి. దానికి సంబంధించిన టెస్ట్ చేయిస్తే.. మరో కోణం కూడా వెలుగులోకి వస్తుందని బాధితులు అంటున్నారు.
ఫంక్షన్స్ కి భారీగా ఖర్చు
కంపెనీ 10వ వార్షికోత్సవం ఎన్ కన్వెన్షన్ లో చేశారు. అప్పుడు రాజకీయ నేతలంతా క్యూ కట్టారు. వీరి సంబంధాలన్నీ ఆర్థికంగా ఉన్నవే. వారికి గిఫ్ట్స్ ఇస్తూ.. అత్యంత దగ్గర అయ్యాడు బూదాటి. కూతురి పెళ్లి రూ.20 కోట్లు పెట్టి చేశాడు. మద్యానికే రూ.2 కోట్లు ఖర్చు పెట్టాడు. రూ.6 కోట్ల విలువ చేసే కార్లని నగదు పెట్టే కొనుగోలు చేశాడు. వైజాగ్ లో ఓ బ్యాంక్ ని ఫ్రాడ్ చేసిన కేసులో శిక్ష పడటంతో ఏ బ్యాంక్ కార్ లోన్ ఇవ్వడానికి ఇష్టపడలేదు.
అమెరికాలో 1000 ఎకరాలు?
అమెరికాలోని డల్లాస్ లో వెయ్యి ఎకరాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని సమాచారం. కుమారుడి పేరు మీద రెస్టారెంట్స్ ఓపెన్ చేయించాడు. ఇక్కడ డబ్బుతో అక్కడ పెట్టుబడులు పెట్టాలని చూశాడు. అయితే.. ఈ ప్రాజెక్ట్స్ ఏ స్థాయిలో ఉన్నాయో తెలియాల్సి ఉంది.
చెప్పుకోలేని వారెందరో!
సాహితీ స్కాం బాధితులు డిఫరెంట్ గా ఉన్నారు. సొంతింటి కోసం జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మంతా ఇచ్చిన 90 శాతం మంది ఉంటే.. బ్లాక్ మనీ వైట్ చేసుకోవడం కోసం మొత్తం నగదు ఇచ్చిన వ్యాపారులు కూడా ఉన్నారు. అలాంటి వారి దగ్గర నుంచి రూ.45 కోట్ల నగదు తీసుకున్నారు. ఏషియన్ సర్జికల్ ఓనర్ రూ.6 కోట్లు ఒకేసారి ఇచ్చి ప్లాట్స్ బుక్ చేసుకున్నారని వినికిడి. ఇప్పుడు అలాంటివారంతా బయటకు చెప్పుకోలేక లోన దాచిపెట్టుకోలేక కుమిలి పోతున్నారని సమాచారం. పనోరమలోని కొన్ని ప్లాట్స్ కి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తోంది.
క్రికెట్ దేవుడి భూమిపైనా బిజినెస్!
ఓ మాజీ క్రికెటర్ కి గచ్చిబౌలి, కోకాపేట్ మధ్యలో 5 ఎకరాల భూమి ఉంది. ఆ వ్యవహారం అంతా చాముండేశ్వరీ నాథ్ అనే వ్యక్తి చూస్తుంటారు. ఆ భూమి పూర్తిగా అగ్రిమెంట్ కాకముందే.. అడ్రస్ చెప్పి అడ్వాన్స్ లు తీసుకున్నారు సాహితీ డైరెక్టర్స్. ఈ విషయం తెలుసుకుని అగ్రిమెంట్స్ రద్దు చేసుకున్నారు ఆ మాజీ క్రికెటర్ వ్యక్తులు.
జగపతి బాబు అమాయకత్వంతో ఆటలు!
సినిమాలో హీరోయిజం చూపిస్తూ.. నిజ జీవితంలో బోల్డ్ గా ఉండే జగపతిబాబుని ప్రచారానికి వాడుకున్నారు. 12వ అంతస్తులో 5వేల స్క్వేర్ ఫీట్స్ ఫ్లాట్ ఇస్తామని తిప్పించుకున్నారు. ఆ వివాదాస్పద సైట్ లో కోట్లు కుమ్మరించి.. 9 అంతస్తులకే అనుమతి తీసుకున్నారు. రెండేళ్లు ఆయన ఆ ఊహల్లోనే బతికారు. ప్రచారం చేశారు. అసలు విషయం తెలుసుకుని లక్ష్మీ నారాయణను చీదరించుకున్నారు జగపతి బాబు.
సాహితీ స్కాం చిత్ర విచిత్రాలు ఎన్నో ఉన్నాయి. కంపెనీ ప్రారంభం అయినప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఎలా బిజినెస్ చేశారు? కేసులు కాక ముందు దోచుకున్న వారెవరు? కేసులు నమోదు అయ్యాక డైరెక్టర్స్ ఎలా మారారో మరో కథనంలో చూద్దాం.