గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీని లక్ష్యంగా చేసుకొని ఉగ్రదాడులకు పాల్పడతామంటూ ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన వ్యక్తి విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో ఉగ్రదాడులకు పాల్పడతామంటూ సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే)కు చెందిన గురుపత్వంత్ సింగ్ ఓ వీడియోను విడుదల చేశారు. “జనవరి 26న ఇళ్లల్లోనే ఉండండి లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీనే మా లక్ష్యం. అదే రోజున ఖలిస్థాన్ జెండాను ఆవిష్కరిస్తాం” అని వీడియోలో చెప్పాడు.
ఎర్రకోటపై ఖలిస్థాన్ జెండా ఎగుర వేసిన వారికి 5 లక్షల డాలర్ల నజరానా ఇస్తామని ప్రకటించాడు. 2023లో భారత్ నుంచి పంజాబ్ను వేరు చేస్తామని తెలిపాడు. రిపబ్లిక్ డే రోజున ప్రత్యేక పంజాబ్ అనుకూల సంస్థ ఎస్ఎఫ్జే ఉగ్రదాడులకు పాల్పడుతుందన్నది ఆ వీడియో సారాంశం. ఈ నేపథ్యంలో వినీత్ జిందాల్ అనే లాయర్ ఎస్ఎఫ్జే సంస్థతోపాటు గురుపత్వంత్ సింగ్పై సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేశారు.
వీడియో చూసిన తర్వాత షాక్కు గురయ్యానని స్థానికంగా ఉంటూనే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం దారుణమని ఆయన అన్నారు. వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ఎస్ఎఫ్జే, గురుపత్వంత్ సింగ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. గురుపత్వంత్ను భారత ప్రభుత్వం గతంలోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. అంతేకాకుండా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందన్న కారణంతో ఎస్ఎఫ్జే పై కూడా నిషేధం విధించింది.
మరోవైపు రిపబ్లిక్ డే సందర్భంగా రాజధాని ఢిల్లీ ప్రాంతంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సిటీ పోలీసులు ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాని స్థానికులను కోరారు.