నిజం నిప్పులాంటిది. కొన్నాళ్ళు మరుగున పడొచ్చు గాక ,కానీ ఏదో ఒక రోజు ఖచ్చింతంగా వెలుగు చూస్తుంది. ఓఅనుమానాస్పద రోడ్డు ప్రమాదం తాలుకు కుట్రకోణం రెండేళ్ళ తర్వాత బైటపడింది. ఇన్సూరెన్స్ డబ్బుకోసం ఓవ్యక్తిని హత్యచేసిన నలుగురి బండారం బైటపడింది. ఈ దారుణం వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామం బోడతండాకు చెందిన ప్రధాన నిందితుడు శ్రీకాంత్ స్థిరాస్థి వ్యాపారం చేస్తూ కొంతకాలంగా నగరంలో మేడిపల్లిలో నివాసం ఉంటున్నాడు.
విలాసాలకు అలవాటు పడిన శ్రీకాంత్ ..బోగస్ కంపెనీల పేరుతో కొంత మంది ఉద్యోగుల పేర్లు చూపి బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు,లోన్లు తీసుకుని జల్సాలు చేసేవాడు. ఇదే క్రమంలో గతంలో రూ. 1.5 కోట్ల మోసం కేసులో నాచారం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తరువాత విడుదలైనా కూడా శ్రీకాంత్ తీరు మారలేదు.
వ్యాపారాలు కూడా చేసే శ్రీకాంత్ వద్ద రెండేళ్ళ క్రితం గుంటూరు జిల్లా నర్సంపేట మండలం గురజాలకు చెందిన భిక్షపతి అనే యువకుడు పనికి చేరాడు. అతనికి తల్లిదండ్రులెవరూ లేకపోవడంతో పనిలోకి చేరిన కొన్నిరోజులకే భిక్షపతి పేరుపై ఐసీఐసీఐ బ్యాంకులో రూ.50 లక్షల విలువ చేసే ఇన్సూరెన్స్ పాలసీ చేయించాడు.
అదేవిధంగా ఆయన పేరుపై రూ.52 లక్షలు హౌసింగ్ లోన్ తీసుకున్న శ్రీకాంత్ మేడిపల్లి పరిధిలో ఇల్లుకొన్నాడు.ఈ క్రమంలో శ్రీకాంత్ కు డబ్బు అవసరం రావడంతో భిక్షపతిని ఇల్లు విక్రయించి డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేసాడు.
తన పేరు మీద రిజిస్టర్ అయిన ఇల్లు అమ్మకానికి భిక్షపతి ఒప్పుకోకపోవడంతో ఎలాగైనా అతన్ని తప్పించి ఇంటితో పాటూ ఇన్సూరెన్స్ డబ్బు కూడా కాజెయ్యాలని పథకం వేసాడు శ్రీకాంత్. ఉపాయం కోసం ఎస్ఓటీ మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న మోతీలాల్ సహాయం కోరి రూ.10 లక్షలు ఇస్టానని బేరం కుదిర్చాడు. ఆనలుగురు పథకం ప్రకారం భిక్షపతిని కారులో ఎక్కించుకుని అధికంగా మద్యం తాగించారు.
షాద్ నగర్ మొగిలిగిద్ద గ్రామ శివారు వద్దకు తీసుకువచ్చి ..తర్వాత పథకం ప్రకారం హాకీస్టిక్ తో భిక్షపతిని తలపై కొట్టి గాయపరచారు. అనంతరం రహదారిపై పడేసి కారుతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు.
ఆయనను హత్య చేసిన అనంతరం భిక్షపతి పేరుమీద ఉన్న రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ ను నామినీగా ఉన్న తనకు ఇవ్వాలని శ్రీకాంత్ ఇన్సూరెన్స్ అధికారులను కలిసాడు. అయితే ప్రమాద దర్యాప్తులో అధికారులకు అనుమానాలు రావడంతో వారు షాద్ నగర్ పోలీసులను ఆశ్రయించారు.
దీంతో కేసు నమోదు చేసిన పోలీసులకు దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.సాక్ష్యాలను సేకరించిన పోలీసులు హత్య చేసిన నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.