బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ నటించిన జెర్సీ సినిమాకు తిప్పలు తప్పట్లేదు. ఇప్పటికే రిలీజ్ డేట్ వాయిదాలతో సతమతమవుతున్న ఈ చిత్రానికి.. మరో అడ్డంకి ఎదురైంది. ఏప్రిల్ 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర కథకు సంబంధించిన కాపీరైట్స్ విషయంలో రచయిత రూపేశ్ జైశ్వల్ కోర్టును ఆశ్రయించారు. 2007లో ఈ కథకు సంబంధించిన కాపీరైట్స్ ను.. మాజీ ఫిలిం రైటర్స్ అసోసియేషన్ లో ‘ది వాల్’ అనే పేరుతో స్క్రిప్ట్ ను రిజిస్టర్ చేసుకున్నట్లు జైశ్వల్ చెప్పారు.
దీన్ని ఇప్పుడు స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్ గా పిలుస్తున్నారని ఆయన వివరించారు. ఆయన రాసిన కథంతా ఓ యువకుడి పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుందని.. పూర్తి క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ కథలో కుటుంబ ప్రేమ, ఆప్యాయత, సంకల్పం, నిస్సందేహమైన ఆశయం మొదలైనవి ప్రాథమిక అంశాలుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. తన కథలో ఎన్నో మార్పులు చేశారని తనకు తెలియకుండా స్క్రిప్ట్ ను తీసుకున్నారంటూ కోర్టులో దావా వేశారు జైశ్వల్.
తనకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తూ ప్రతివాదులు అన్యాయంగా డబ్బును సంపాదించుకేనే ప్రయత్నం చేస్తున్నారని ఆ దావాలో పేర్కొన్నారు. తనను మోసం చేసి మూడో వ్యక్తి ద్వారా స్క్రిప్ట్ ను పొందారని.. ఈ విషయంలో ఒకరికొకరు కుమ్మక్కై తనను మోసం చేస్తున్నారని ఆరోపించారు జైశ్వల్. హిందీ చిత్రం జెర్సీని థియేటర్ లలో లేదా మరేదైనా డిజిటల్ మాధ్యమాల్లో విడుదల చేయడంపై నిషేధం విధించాలని కోర్టును కోరారు.
కనీసం దీనికి సంబంధించిన కేసులో తీర్పు వచ్చేవరకైనా సినిమా విడుదల ను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. 2019లో తెలుగులో నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమాను హిందీలో అదే పేరుతో రీమేక్ చేశారు. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించారు. ఏప్రిల్ 14న థియేటర్లలోకి రావాల్సి ఉండగా.. యశ్ నటించిన ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ కారణంగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 22 కు వాయిదా వేశారు. కానీ.. దానికి జైశ్వల్ అనుకోని ట్విస్ట్ ఇచ్చారు.