బీజేపీ ఎంపీ అరవింద్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ కమలదళం వైపు అడుగులు వేసేశారు. రేపోమాపో ఆయన ముహూర్తం చూసుకుని కమలం పార్టీలో చేరుతున్నారు. ఇది రూఢీగా తెలిసిన వార్త.
నిజామాబాద్ : అసలు అడ్డే లేదనుకున్న టీఆర్ఎస్కు బీజేపీ చాలా పెద్ద తలకాయ నొప్పిగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో మేమే శాశ్వతం అనుకున్నటీఆర్ఎస్ దొరలకు ఇప్పుడు పీఠాలు కదులుతుండటం వణుకు పుట్టిస్తున్నాయి. పార్టీ బీటలు వారుతున్న ఛాయలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపోమాపో పార్టీని బీజేపీ నిలువునా చీల్చేస్తుందన్న వాదన రోజురోజుకి గట్టిగా వినిపిస్తోంది.
ఏ నేత ఎప్పుడు కారు దిగిపోతారో అనే భయంలోనే మొన్న కాబినెట్ విస్తరణ జరిగిందనే మాట గట్టిగానే వినిపిస్తోంది. అలానే అసమ్మతి స్వరాలూ కూడా ఎప్పటికప్పుడు ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ కారు వదిలి కమలం వైపు కదులుతున్నారు. బీజేపీలో చేరడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నారు. ఇక తీర్ధం తీసుకోవడమే తరువాయి అని అంటున్నారు.
మొన్నటి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించలేదని అసంతృప్తితో ఉన్న షకీల్ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్తో భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా కలిశామని అరవింద్ చెప్తున్నా, పార్టీ మారే ఆలోచనలోనే కలిసి మాట్లాడుకున్నారని సమాచారం. మొన్న నిజామాబాద్లో కల్వకుంట్ల కవితను భారీ మెజారిటీతో ఓడించినప్పటి నుంచి అరవింద్ను బీజేపీలో ఒక ముఖ్య నేతగా చూస్తున్నారు. దీనితో షకీల్ ఇప్పుడు అరవింద్ను కలవడం వెనుక పార్టీ మారే వ్యవహారం మినహా మరే కారణాలు లేవని విశ్లేషకుల అంచనా.