శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే మహారాష్ట్రకు సీఎం అవుతారనుకోలేదన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. షిండే ప్రమాణ స్వీకారం తర్వాత మీడియాతో మాట్లాడిన పవార్.. కీలక వ్యాఖ్యలు చేశారు. అంత పెద్ద పదవి వస్తుందని బహుశా షిండే కూడా అనుకోనుండకపోవచ్చని వ్యాఖ్యానించారు.
నూతన సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూడీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లకు పవార్ శుభాకాంక్షలు తెలిపారు పవార్. వాస్తవానికి షిండే ఉపముఖ్యమంత్రి, ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారనుకున్నానని ఆయన వెల్లడించారు. కానీ.. ఈ పరిణామాన్ని తాను ఊహించలేదని వ్యాఖ్యానించారు. పదవి రావడంపై షిండే కూడా తనలాగే షాకయ్యి ఉండొచ్చన్నారు.
అయితే.. ఉప ముఖ్యమంత్రి పదవితో దేవేంద్ర ఫడ్నవీస్ సముఖంగా లేరని.. ఆయన ముఖంలో ఆ చాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపారు. కేవలం అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఫడ్నవీస్ అలా నడుచుకున్నారే తప్ప ఆయనకు ఆ పదవిలో ఉండటం ఇష్టం లేనట్టే కనిపిస్తోందని వ్యాఖ్యానించారు పవార్.
మరోవైపు మహారాష్ట్రలో శివసేన పని అయిపోయిందంటూ వినిపిస్తున్న వాదనలను శరద్ పవార్ కొట్టి పారేశారు. ఇలాంటి ఒడిదుడుకులను శివసేన ఎన్నో ఎదుర్కొందని అభిప్రాయపడ్డారు. ఆ పార్టీకి ఇలాంటి పరిస్థితులు కొత్తేం కాదన్నారు. ఏది ఏమైనా షిండే ముఖ్యమంత్రి అవ్వడం కాస్త ఆశ్చర్యంగానే ఉందన్నారు పవార్.