కేసీఆర్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామంలో రైతు గోస దీక్షలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలకులు రాబందుల్లా.. రాక్షసులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పినపాక నియోజక వర్గంలో అడుగడుగునా పోడు సమస్య ఎదురవుతుందని, ఎకరాకు రూ. 5 వేలు రైతు బంధు ఇచ్చి 25 వేల పథకాలు నిలిపివేశారని ఆరోపించారు. పంట నష్ట పరిహారం కూడా తెలంగాణలో దిక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్ట పోయినప్పుడు పరిహారం ఇవ్వకుండా రూ. 5 వేలు ఇస్తే సరిపోతుందా? అని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో పంట భీమా ఎందుకు లేదని నిలదీశారు.
పోడు భూముల విషయంలో పట్టాలు కావాలని అడిగితే మహిళలని చూడకుండా పోలీసులను పెట్టి హింసిస్తున్నారని షర్మిల ఆరోపించారు. వైఎస్సార్ హయాంలో 3 లక్షల 30 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారని తెలిపారు. సాగు చేసుకున్న వారికి చెందాలని వారికే పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్సార్ది.. ఇప్పుడున్న ముఖ్యమంత్రి 8 ఏళ్లలో ఒక్క ఎకరాకు కూడా పట్టా ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
రైతులకు ఉచిత కరెంట్ అని చెప్పి 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. 7 గంటలు కరెంట్ ఇస్తే పంట ఎండిపోతుందని సిద్దిపేట జిల్లాలో మనస్తాపం చెందిన మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని షర్మల ఆవేదన వ్యక్తం చేశారు. పంట ఎండిపోతుంటే తెచ్చిన అప్పులు ఏం చేయాలో దిక్కు తోచక ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆ మహిళా రైతు ఆత్మహత్యకు సీఎం కేసీఆరే కారణమని ఆరోపించారు. గత 6 నెల్లలో రాష్ట్రంలో వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.
యాసంగి పంట విషయంలో కేసీఆర్ చెప్పిన మాటకి 17 లక్షల మంది రైతులు పంట వేసుకోలేదని, ఆ నష్టం ఎవరు భరించాలని నిలదీశారు. ముఖ్యమంత్రి నాలుకకు నరం లేదని, ఒక సారి ఓ మాట.. మరో సారి మరో మాట మాట్లాడతారని.. దీంతో రైతులు ఆగం అవుతున్నారన్నారు. రైతులు కూడా సీఎం కాళ్ళ దగ్గర బాంచెన్ అని పడి ఉండాలా..? అని షర్మిల ప్రశ్నించారు. రైతులకు ఏ పంట వేసుకోవాలో కూడా స్వతంత్రం లేదని.. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని దుయ్యబట్టారు.