వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి తెలంగాణ సర్కార్ పై విరుచుకుపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన అభయహస్తం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నీరుగార్చిందని మండిపడ్డారు. పొదుపు సంఘాల మహిళలకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసాగా ఉన్న పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని ట్విట్ చేశారు షర్మిల.
2017 వరకు అమలైన పథకంలో మార్పులు తీసుకొస్తామని చెప్పిన కేసీఆర్ సర్కార్.. ఈ ఐదేళ్లలో పథకాన్ని కనుమరుగయ్యేలా చేశారని మండిపడ్డారు. అభయహస్తం పథకం కింద డబ్బులు కట్టిన మహిళలకు వడ్డీతో పాటు చెల్లించాలని అన్నారు.
ఇంటికో పెన్షనంటూ మెలికలు పెట్టి.. పథకాన్ని అటకెక్కించారని అన్నారు. వృద్ధ్యాప్య మహిళలకు ఆర్థిక భరోసా లేకుండా చేశారని విమర్శించారు. ఆసరా పెన్షన్స్ తో సంబంధం లేకుండా అభయహస్తం పథకాన్ని తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేశారు.
గతంలో వైఎస్ఆర్ నాయకత్వంలో మహిళల కోసం ప్రవేశ పెట్టిన పథకాలను కేసీఆర్ నీరుగారుస్తున్నారని అన్నారు. మహిళల పట్ల ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా వెంటనే అభయహస్తం పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని షర్మిల ట్విట్టర్ లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.