హుజూర్ నగర్ నియోజక వర్గం లక్కవరంలో జోరు వానలోనూ నిరసన చేపట్టారు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల. మటంపల్లి మండలం టీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసే వరకు దీక్ష విరమించేదే లేదని స్పష్టం చేశారు. నిందితులను కస్టడీలోకి తీసుకొనే వరకు ఆందోళన విరమించని చెప్పారు. కళ్ళముందు దాడి జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోరా అని మండిపడ్డారు షర్మిల.
ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా లక్కవరంలో షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ సమయంలో వైటీపీ నేత ఏపురి సోమన్నపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వైటీపీ శ్రేణులు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దాడికి పాల్పడిన టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయాలంటూ పోలీసులను డిమాండ్ చేశారు.
స్థానికంగా ఉన్న వైఎస్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు షర్మిల. దాడి చేసిన వారిని అరెస్ట్ చేసేవరకు దీక్ష కొనసాగిస్తానని తెలిపారు. జోరు వాన పడుతున్నా తన నిరసనను కొనసాగించారు.
ప్రజాప్రస్థానంలో భాగంగా ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్నారు షర్మిల. 31వ వారం లక్కవరం గ్రామంలో ప్రారంభమైంది. రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేసీఆర్ కు మాత్రం 80వేలే కనిపిస్తున్నాయని, ఎనిమిదేండ్లుగా నిరుద్యోగుల్ని మభ్య పెట్టింది చాలని, వెంటనే ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయడంతో పాటు కొత్త జిల్లాల వారిగా ఖాళీలను గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగ యువత కుటుంబాలకు పరిహారం చెల్లించాలన్నారు.