స్మార్ట్ ఫోన్లకు ప్రతి ఒక్కరూ బానిసలుగా మారారు. ఎంతలా అంటే అవి వారి జీవితంలో భాగమైపోయాయి. ఫోన్ లేకుండా రోజు గడవట్లేదు. అన్ని పనులూ స్మార్ట్ ఫోన్ నుంచే చేసే విధంగా టెక్నాలజీ మారింది. తాజాగా గంటలకొద్ది స్మార్ట్ ఫోన్ చూడటం వల్ల కంటి చూపు కూడా పోతోందని తేలింది.
హైదరాబాద్ కు చెందిన మంజు అనే 30 ఏళ్ల మహిళ తన చూపు తగ్గిపోతోందని వైద్యులు దగ్గరకు వెళ్లింది. టెస్టులు చేసిన వైద్యులు అసలు సమస్య అంతా స్మార్ట్ ఫోన్ ను గంటల తరబడి చూడటం వల్లే వచ్చిందని గుర్తించారు. చీకటిలో ఫోన్ ను అదే పనిగా చూస్తూ కంటి చూపు కోల్పోయే స్థితికి చేరుకుంది ఆ మహిళ. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ న్యూరాలజిస్ట్ డా.సుధీర్ ట్విట్టర్ లో తెలిపారు.
ఇక డాక్టర్ తెలిపిన వివరాల ప్రకారం..మంజు ప్రతి రోజు చీకటి గదిలో చాలా సేపు స్మార్ట్ ఫోన్ చూస్తూ గడిపారు. దీని ల్ల ఆమె దాదాపు ఏడాదిన్నర కాలంగా కంటి సమస్యలతో బాధపడుతున్నారు. వస్తువులను సరిగ్గా చూడలేని స్థితికి ప్రస్తుతం ఆమె కళ్లు చేరుకున్నాయి. కంటి వైద్యుడి వద్దకు వెళ్లినా లాభం లేకుండా పోయింది. న్యూరాలజిస్ట్ వద్దకు వెళ్లాలని కంటి వైద్యుడు ఆమెకు సూచించారు. దీంతో ఆమెకు మరిన్ని వైద్య పరీక్షలు చేసి, స్మార్ట్ ఫోన్ విజన్ సిండ్రమ్ గా న్యూరాలజిస్ట్ నిర్ధారించారు.
ఈ సిండ్రమ్ ఉంటే కంటి సంబంధిత సమస్యలు రావడమే కాకుండా అంధులుగా మారే ప్రమాదమూ ఉంది. అయితే మొబైల్ గంటల కొద్దీ చూస్తుండడం వల్లే ఆమె కంటిలో సమస్య ఏర్పడిందన్న తమ అంచనా నిజమేనని నిర్ధారణ అయిందని వైద్యుడు చెప్పాడు. మొబైల్ ఫోన్లు అధికంగా వాడే వారు కంటి గురించి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.