సివిల్స్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం 685 మందిని ఎంపిక చేసింది యూపీఎస్సీ బోర్డు. సివిల్స్ సర్వీసెస్ లో ఈసారి అమ్మాయిలు హవా చాటారు. నలుగురు టాపర్లు అమ్మాయిలే కావడం గమనార్హం. వీరిలో శృతి శర్మకు అల్ ఇండియా మొదటి ర్యాంక్ రాగా.. అంకిత అగర్వాల్ కు రెండో ర్యాంకు, గామిని సింగ్లాకు మూడో ర్యాంకు దక్కాయి.
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోటీ పరీక్ష సివిల్స్ 2021 ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు మెరిశారు. యశ్వంత్ కుమార్ రెడ్డి 15వ ర్యాంక్, పూసపాటి సాహిత్య 24వ ర్యాంక్, మంత్రి మౌర్య భరద్వాజ్ 28వ ర్యాంక్ సాధించారు. కె.కిరణ్మయి 56వ ర్యాంక్, శ్రీపూజ 62వ ర్యాంక్, గడ్డం సుధీర్ కుమార్ రెడ్డి 69వ ర్యాంకు, ఆకునూరి నరేశ్ 117వ ర్యాంకు, అరుగుల స్నేహ 136వ ర్యాంకు, బొక్క చైతన్య రెడ్డి 161వ ర్యాంకు, ఎస్.కమలేశ్వర్ రావు 297వ ర్యాంకు, విద్యామరి శ్రీధర్ 336వ ర్యాంకు, దిబ్బడ ఎస్వీ అశోక్ 350వ ర్యాంకు, శరత్ నాయక్ 374వ ర్యాంక్, నల్లమోతు బాలకృష్ణ 420వ ర్యాంకు, ఉప్పులూరి చైతన్య 470వ ర్యాంకు, మన్యాల అనిరుధ్ 564వ ర్యాంకు, బిడ్డి అఖిల్ 566వ ర్యాంకు, రంజిత్ కుమార్ 574వ ర్యాంకు, పాండు విల్సన్ 602వ ర్యాంకు, బాణావత్ అరవింద్ 623వ ర్యాంకు, బచ్చు స్మరణ్ రాజ్ 676వ ర్యాంకు ను కైవసం చేసుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాసింపల్లె కు చెందిన ఆకునూరి నరేష్ కు సివిల్స్ లో ఆలిండియా 117 వ ర్యాంక్ వచ్చింది. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం చిల్పకుంట్ల గ్రామానికి చెందిన బొక్క చైతన్య రెడ్డికి 161వ ర్యాంకు వచ్చింది. అయితే.. చైతన్య తండ్రి సoజీవ రెడ్డి గతంలో వరంగల్ డీసీఓగా పని చేశారు. ప్రస్తుతం సాగునీటి శాఖలో అసిస్టెంట్ ఇంజనీరుగా చైతన్యరెడ్డి పనిచేస్తున్నారు.
జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన శరత్ నాయక్ కు సివిల్స్ లో 374 వ ర్యాంకు వచ్చింది. తండ్రి భాష్యనాయక్ వ్యవసాయం చేస్తుండగా.. తల్లి యమున మినీ అంగన్వాడీ కార్యకర్తగా సేవలందిస్తున్నారు.
ఇదిలా ఉంటే అల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించిన శృతిశర్మ.. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు. జామియా మిలియా ఇస్లామియా రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో సివిల్స్ పరీక్షల కోసం శిక్షణ తీసుకున్నారు. యూపీఎస్సీ ఎంపిక చేసిన 685 మందిలో.. 277 మంది జనరల్ కేటగిరి అభ్యర్థులు కాగా.. ఆర్థికంగా వెనుకబడిన కేటగిరివారు 73 మంది ఉన్నారు. ఓబీసీ అభ్యర్థులు 203, ఎస్సీలు 105 మంది, ఎస్టీ అభ్యర్థులు 60 మంది ఉన్నారు. సాధించిన ర్యాంకును బట్టి ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ – 1, గ్రూప్ 2 ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. కాగా, సివిల్స్ కు ఎంపికైన అభ్యర్థులను అభినందిస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.