అమరావతి రాజధానిపై సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అమరావతి రాజధాని కేసును 28వ తేదీనే విచారిస్తామని జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం తేల్చి చెప్పింది. 28వ తేదీకన్నా ముందే విచారణ జరపాలన్నఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదుల విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. రాజ్యాంగపరమైన అంశాలు ఇందులో చాలా ఇమిడి ఉన్నాయని జస్టిస్ కేఎం జోసెఫ్ ధర్మాసనం పేర్కొంది.
28వ తేదీ ఒక్క రోజే విచారణ సరిపోదని.. బుధ, గురు వారాల్లో కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వ లాయర్లు కోరారు. బుధ, గురు వారాల్లో నోటీసులు ఇచ్చిన కేసుల్లో విచారణ జరపరాదని సీజేఐ సర్క్యులర్ ఉందని ధర్మాసనం గుర్తు చేసింది. అయితే సీజేఐ ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించడానికి అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. అందుకు అనుమతి ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.
కాగా ఏపీలో ఇప్పుడు రాజధాని వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సుప్రీంకోర్టులో రాజధాని అంశంపై తీర్పు వస్తే.. విశాఖను రాజధానిగా చేయవచ్చని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. ఆ సమయానికి నూతన రాజధానిని సిద్ధం చేయాలని ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది.
ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు అమరావతికి అనుకూలంగా ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళ్లింది. దీనిపై విచారణ నిర్వహిస్తున్న సుప్రీంకోర్టు గతంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే కొన్ని అంశాలపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను 28వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఆ తేదీ కంటే ముందే విచారణ జరపాలంటూ ఏపీ ప్రభుత్వం కోరుతోంది. కానీ ధర్మాసనం దీనికి కుదరదంటూ తేల్చి చెప్పింది.