హైదరాబాద్ శివారులో కాల్పులు కలకలం సృష్టించాయి. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా షామీర్ పేట దగ్గర ఓ వైన్ షాపు యజమానిని బెదిరించి.. అతని దగ్గరున్న డబ్బులతో దుండగులు ఉడాయించారు. దీంతో ఈ మధ్య కాలంలో నగర శివారు ప్రాంతాల్లో గన్ తో దాడులు,దోపిడీలు బాగా పెరిగిపోతున్నాయి. కొన్ని నెలల క్రితమే నాగోల్ లో తుపాకీతో ఎటాక్ చేసి జ్యువెలరీ షాపును దోచుకుపోయారు దుండగులు. ఈ ఘటన మర్చిపోక ముందే మరోసారి షామీర్ పేట్ లో కాల్పులు చోటు చేసుకోవడంతో జనం హడలెత్తిపోతున్నారు.
మేడ్చల్ జిల్లా ఉద్దిమర్రి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఉద్దిమర్రిలో మద్యం షాపు నిర్వహిస్తోన్న బాలకృష్ణ అనే వ్యక్తి..రాత్రి వైన్ షాపును మూసేవేసి తిరిగి వెళ్తున్న సమయంలో.. దుండగులు ఎటాక్ చేశారు. తుపాకీతో బెదిరించారు. మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు కూడా తెలుస్తోంది. ఈ తర్వాత కర్రలతో బాలకృష్ణ పై దాడి చేశారు.
అతడి దగ్గరున్న రెండు లక్షల రూపాయలతో పారిపోయారు. ఇక బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కాల్పుల ఘటనపై పేట్ బషీర్ బాగ్ ఏసీపీ రామలింగరాజు మాట్లాడుతూ మద్యం షాపు దగ్గర కాల్పులు జరిపి దోపడీకి పాల్పడ్డారని..మూడు రౌండ్లు కాల్పులు జరిపి, కర్రలతో దాడి చేసి రెండు లక్షలు ఎత్తుకెళ్లారని తెలిపారు. దోపిడీకి పాల్పడిన సమయంలో దుండగులు మంకీ క్యాప్స్ ధరించి ఉన్నారని వెల్లడించారు.
ఇక కాల్పుల ఘటనలో నిందితులను పట్టుకునేందుకు 5 బృందాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అయితే హైదరాబాద్ శివారులో జరిగిన ఈ కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.