ఐఐఎంలు, ఐఐటీలలో ఎస్సీ,ఎస్టీ ఫ్యాకల్టీ లోటు ఉందని బహుజన సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. 9,640 ఫ్యాకల్టీలో కేవలం 23 మంది ఎస్టీలు,157 మంది ఎస్సీలు మాత్రమే ఉన్నారని చెప్పారు. దాంతో పాటు ఓ జాతీయ వార్తా పత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఆయన ఈ సందర్భంగా షేర్ చేశారు.
ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐఎంలలో షెడ్యూల్డ్ తెగలు ఇతర వెనుకబడిన కులాల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని ఈ కథనంలో పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో ఈ వర్గాల నుంచి ఒక్క అధ్యాపకుడు కూడా లేరని చెప్పారు. డిసెంబర్ లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పార్లమెంట్ లో సమర్పించిన డేటా ప్రకారం.. 18 ఐఐఎంలలో మంజూరైన 784 ఫ్యాకల్టీ పోస్టులలో కేవలం రెండు మాత్రమే ఎస్టీ వర్గానికి చెందినవని తెలిపారు.
ఓబీసీ కేటగిరీకి చెందిన 27 మంది సభ్యులు ఉండగా కేవలం ఎనిమిది మంది అధ్యాపకులు మాత్రమే ఉన్నారని, ఎస్సీల పరిస్థితి ఏమీ బాగోలేదన్నారు. ఐఐఎంలలో ప్రస్తుతమున్న మొత్తం ఫ్యాకల్టీ సభ్యులలో ఎస్సీలు,ఎస్టీలు, ఓబీసీలు కేవలం 6 శాతం మాత్రమే ఉన్నారని, ఐఐటీల పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉందని స్పష్టం చేశారు.
మంజూరైన 8,856 మంది అధ్యాపకుల్లో 4,876 మంది జనరల్ కేటగిరీ, 329 మంది ఓబీసీలు, 149 మంది ఎస్సీలు, 21 మంది ఎస్టీ వర్గాలకు చెందిన వారు ఉన్నారు. ఫలితంగా కొత్త, పాతవి కలిపి 23 ఐఐటీలలో ప్రస్తుతమున్న ఫ్యాకల్టీలో 9 శాతం మాత్రమే ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు ఉన్నట్టు తెలుస్తోంది.