రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భూ నిర్వాసితుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ కొందరు నిరసనకు దిగారు. పురుగుల మందు డబ్బాలు తీసుకుని వాటర్ ట్యాంక్ ఎక్కారు.అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయడంతో పాటు ఇళ్లు కూల్చివేత ఆపేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
నిన్న రాత్రి లద్నాపూర్ గ్రామానికి వచ్చిన సింగరేణి యాజమాన్యం, అధికారులు జేసీబీలతో ఇళ్లు కూల్చే ప్రయత్నం చేశారు. అడ్డుకున్న భూ నిర్వాసితులను అరెస్ట్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
283 ఇళ్లకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇప్పించాలని గత 70 రోజుల నుండి లద్నాపూర్ నిర్వాసితులు శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. అయినా పట్టించుకోని యాజమాన్యం ఇళ్లను కూల్చేందుకు సిద్ధమయ్యారు. అడ్డుకున్న దాదాపు 100 మంది నిర్వాసితులను అరెస్ట్ చేసి మంచిర్యాల జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్కు తరలించారు. తాజాగా సింగరేణి అధికారులు జేసీబీల సాయంతో ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు.
బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి ఆగ్రహం
సింగరేణి ఓసీపీ 2 నిర్వాసితుల విషయంలో సింగరేణి వైఖరిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి తప్పుపట్టారు. లద్నాపూర్ గ్రామస్థులను అదుపులోకి తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. అర్థారాత్రి సమయంలో నిర్వాసితులను అదుపులోకి తీసుకోవడంపై వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం నిర్వాసితులను ఆదుకోవాలని, 283 ఇళ్లకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.