ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో సిట్ దాఖలు చేసిన మెమోను నాం పల్లి ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు తీర్పును సిట్ హైకోర్టులో సవాల్ చేసింది.
ఈ కేసును అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) మాత్రమే దర్యాప్తు చేయాలని, శాంతి భద్రతల పోలీసులు, సిట్ కు అధికారం లేదన్న ఏసీబీ న్యాయస్థానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో సిట్ పిటిషన్ వేసింది. సిట్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరిపేందుకు హైకోర్టు అంగీకరించింది.
ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు జస్టిస్ నాగార్జున బెంచ్ దీనిపై విచారణ జరపనుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఏసీబీ కోర్టులో సిట్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామి, లాయర్ శ్రీనివాస్ను నిందితులుగా చేర్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
ఈ కేసును దర్యాప్తు చేసే అధికారం సిట్కి లేదని ఏసీబీ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీ.రాజగోపాల్ తేల్చి చెప్పారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్(పీసీ యాక్ట్) కింద సిట్ దాఖలు చేసిన మెమోను ఆయన తిరస్కరించారు. పీసీ యాక్ట్ కేసుల్లో ఏసీబీకి మాత్రమే దర్యాప్తు అధికారం ఉందని ఆయన పేర్కొన్నారు.
శాంతి భద్రతల పోలీసులకుగానీ, సిట్కుగానీ ఈ కేసులో దర్యాప్తు జరిపే అధికారం లేదని స్పష్టం చేశారు. బీజేపీ నేత బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్ను నిందితులుగా చేర్చాలంటూ గత నెల 22న ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు మెమో ఫైల్ చేశారు. దానిపై మంగళవారం విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ఆ మెమోను తిరస్కరించింది.