టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్ బృందం ఆరా తీస్తుంది. ప్రశ్నాపత్రం లీక్ కేసులో నిందితులను సిట్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో రెండో రోజు కూడా నిందితులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. 2022 అక్టోబర్ నుంచి జరిగిన ఏడు పరీక్షలపై కూడా సిట్ ఫోకస్ పెట్టింది. ఈ ఏడు పరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ అధికారులు ఫోకస్ చేస్తున్నారు. ఈ ఏడు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు ఏమైనా లీక్ అయ్యాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.
గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఏడు పరీక్షలను టీఎస్పీఎస్సీ నిర్వహించింది. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, సీపీడీఓ, సూపర్ వైజర్ గ్రేడ్ -2, ఏఈఈ, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, ఏఈ పరీక్షలు నిర్వహించారు. అయితే ఇప్పటికే ఏఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయిందని సిట్ టీమ్ గుర్తించింది.
మిగిలిన పరీక్షలు జరిగిన తీరుపై కూడా అధికారులు ఫోకస్ చేశారు. ఈ నెల 5వ తేదీన జరిగిన ఏఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రంతో పాటు మరో నాలుగు ప్రశ్నాపత్రాలను కూడా ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో డౌన్ లోడ్ చేసుకున్నారని సిట్ టీమ్ గుర్తించింది. పేపర్ లీక్ కేసులో ప్రవీణ్, రాజశేఖర్ లు కీలకంగా వ్యవహరించినట్లుగా సిట్ టీమ్ గుర్తించింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన రేణక కొందరికి ఈ పేపర్ ను విక్రయించినట్లుగా అధికారులు గుర్తించారు. పేపర్ లీక్ కేసులో లావాదేవీల విషయంలో చోటు చేసుకున్న విభేధాల కారణంగా ఈ విషయం బయటకు వచ్చిందని అధికారులు గుర్తించారు.