బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3లోని ఆయన నివాసంలో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో ఆయన ఆరోపణలు చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించి ఆధారాలు వుంటే ఇవ్వాలని నోటీసుల్లో కోరారు.
ఆ ఆధారాలు దర్యాప్తునకు ఉపయోగపడతాయని నోటీసుల్లో సిట్ అధికారులు పేర్కొన్నారు. టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీ వ్యవహారంలో ఇటీవల బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పీఏ గ్రామంలో గ్రూప్-1 ప్రిలిమ్స్లో 50 మందికి పైగా అభ్యర్థులకు 100 మార్కులు దాటాయని ఆయన ఆరోపణలు చేశారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వారిలో అధికార బీఆర్ఎస్ నేతల పిల్లలే ఎక్కువగా ఉన్నారంటూ ఆయన సంచలన ఆరోపనలు చేశారు. మరోవైపు టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీ విషయంలో ఆరోపణలు చేస్తున్న నేతలకు నోటీసులు జారీ చేయాలని సిట్ నిర్ణయించింది.
ఆ నిర్ణయం మేరకు బండి సంజయ్ కు నోటీసులు అందజేశారు. 24న హిమాయత్నగర్లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆయన్ని కోరారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా నిన్న నోటీసులు ఇచ్చారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని ఆయన్ని కోరారు.