తెలుగు రాష్ట్రాలకు సిత్రాంగ్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు పదే పదే హెచ్చరిస్తూనే ఉంటున్నారు. అయితే వాతావరణం గంటగంటకూ మారుతోంది. అప్పుడే ఎండ దంచికొడుతోంది. మళ్లీ కాసేపటికే భారీ వర్షం పడుతోంది. గత మూడు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. వర్షాల కారణంగా నదులు, చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి.
దీనికి తోడు తుపాన్ ముప్పు ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కాగా ఈ నెల 18న ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనంతో ముప్పు మొదలయ్యే అవకాశముందని వెదర్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది. దీనికి తోడు అక్టోబర్ 20వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా ఏపీ, తెలంగాణ వైపు దూసుకొస్తుందని అధికారులు అంచనా వేశారు. దీంతో ఇది తుపాన్ నుంచి పెను తుపానుగా మారే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం తుపాన్ గా మారితే ‘సిత్రాంగ్’ అనే పేరుతో పిలవనున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. సిత్రాంగ్ అంటే థాయ్ భాషలో ‘వదలని’ అని అర్థం. అంటే ఈ వర్షాలు అప్పుడే వదేలట్టు కనిపించడం లేదు.
సిత్రాంగ్ సూపర్ సైక్లోన్ గా మారితే దీని ప్రభావం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై అధికంగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాన్ కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి. దీనికి సూపర్ సైక్లోన్ తోడైతే జలవిలయం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.