కాకినాడ నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ ఎన్ఎఫ్ సి నగర్ వద్ద పట్టా తప్పింది. దీంతో ఆరు కోచ్ లకు ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ప్రకటించారు. గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ప్రాంతాన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం పరిశీలించారు. ట్రాక్ పునరుద్దరణ పనులను ఆయన పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..విశాఖ పట్నం నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరిన గోదావరి ఎక్స్ ప్రెస్ రైలు ఘట్ కేసర వద్ద పట్టాలు తప్పినట్టుగా చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని వెల్లడించారు. 6.15 నిమిషాల సమయంలో రైలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందిందని, 16 కు పైగా బోగీలతో విశాఖ నుంచి హైదరాబాద్ కు గోదావరి ఎక్స్ ప్రెస్ బయల్దేరిందన్నారు ఆయన.
అందులో ఆరు బోగీలు పట్టాలు తప్పాయని, ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్య స్థానాలు చేర్చామన్నారు. ప్రమాదంపై విచారణ కొనసాగుతోందని, రాత్రి వరకు ట్రాక్ పునరుద్దరణ పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా.. ప్రస్తుతం దెబ్బతిన్న రైల్వే లైన్ కాకుండా మరో లైన్ ద్వారా రైళ్లను నడిపిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది.