నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం విషాదాన్ని నింపింది. డెక్కన్ మాల్ ఘటన మరువక ముందే ఈ ఘటన జరగడం నగరవాసులను కలవర పెడుతుంది. సికింద్రాబాద్లో గురువారం రాత్రి స్వప్నలోక్ కాంప్లెక్స్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతుల్ని ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివ, ప్రశాంత్గా గుర్తించారు. వీరిలో వరంగల్కు చెందిన ముగ్గురు, ఇద్దరు మహబూబాబాద్ వాసులు, ఖమ్మంకు చెందిన ఒకరు ఉన్నారు.
ఈ ఘటనలో మంటల తీవ్రత పెరిగే అవకాశముందని భావించిన అధికారులు.. స్వప్నలోక్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న నివాసాల్లో ఉన్నవారిని ఖాళీ చేయించారు. నాలుగు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. ఘటన స్థలాన్ని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ పరిశీలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని అపోలో, యశోద ఆసుపత్రులకు తరలించారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు.
సికింద్రాబాద్ ఆర్పీ రోడ్లో ఉన్న స్వప్నలోక్ కాంప్లెక్స్ ఎనిమిది అంతస్తుల్లో ఉంది. గురువారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని స్థానికులు చెబుతున్నారు. ముందు ఎనిమిదో అంతస్తులో మొదలైన మంటలు 7, 6, 5 అంతస్తులకు వ్యాపించాయి అని చెబుతున్నారు. మంటల్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే వారు స్వప్నలోక్ కాంప్లెక్స్ దగ్గరకు చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు.
ప్రమాదం జరగడంతో చాలా మంది బయటకు వచ్చేశారు.. కొందరు మాత్రం బయటకు రాలేక చిక్కుకుపోయారు. దట్టమైన పొగలు అలముకోవడంతో చాలామంది బయటకు రాలేకపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో లిఫ్టులు పని చేయడం లేదని చెప్పారు ప్రమాదం నుంచి బయటపడినవారు. అలాగే ప్రమాదం జరిగిన సమయంలో చీకట్లో ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో కొందరు లోపలే చిచ్కుకుపోయారు. తమను కాపాడాలంటూ లోపలి నుంచి కేకలు వేయడం కనిపించింది.
ఈ స్వప్నలోక్ కాంప్లెక్స్లో మొత్తం 8 అంతస్తులు ఉండగా.. మొత్తం 200 షాపులు, 160 ఆఫీసులు ఉన్నాయి. నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఈ కాంప్లెక్స్ నిర్మించారు. సికింద్రాబాద్లోనే వరుసగా అగ్నిప్రమాద ఘటనలు జరగడం కలవరపెడుతున్నాయి. దక్కన్ మాల్ ఘటనను మర్చిపోకముందే.. ఈ ప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.. చనిపోయినవారికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా సమాచారం ఇచ్చారు.