సోమేశ్ కుమార్ గురువారం ఆంధ్రప్రదేశ్ లో విధుల్లో చేరడానికి సిద్ధమయ్యారు. హైకోర్టు తీర్పు, డీవోపీటీ ఉత్తర్వుల మేరకు ఆ రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వనున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణలోనే సర్వీసులో ఉన్న సోమేశ్ కుమార్ వివిధ హోదాల్లో పనిచేసి సీఎస్ బాధ్యతలు నిర్వహించారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేరుతున్నందున ఏ స్థాయిలో పనిచేయాలని ఉత్తర్వులు ఇచ్చినా చేయడానికి సిద్ధమైనట్లు తెలిసింది. అయితే ఏపీ కేడర్ గా హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆ రాష్ట్రానికి వెళ్తారా లేక రిజైన్ చేస్తారా లేక వీఆర్ఎస్ తీసుకుంటారా అనే సస్పెన్స్ కు సోమేశ్ కుమార్ మరికొన్ని గంటల్లోనే క్లారిటీ ఇవ్వనున్నారు.
ఏపీ రాష్ట్రానికి వెళ్లడానికి సుముఖంగా లేరనే వార్తలు వినిపించినప్పటికీ పబ్లిక్ సర్వెంట్ గా ఎక్కడైనా పనిచేయడానికి మానసికంగా సిద్ధం కావాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆయన పదవీ కాలం ఈ ఏడాదీ చివరి వరకూ ఉన్నందున ఒక సంవత్సర కాలాన్ని వృథా చేసుకోవాలనే ఆలోచన లేనట్లు సమాచారం. స్థాయితో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఏ బాధ్యతలు అప్పచెప్పినా కంటిన్యూ చేయాలనే భావనతో ఉన్నట్లు తెలిసింది.
అయితే తెలంగాణ నుంచి రిలీవ్ చేయాలంటే డీవోపీటీ లేఖ రాయడంతో మరికొన్ని గంటల్లోనే ఆయనను రిలీవ్ చేస్తూ ఉత్తర్వలు వెలువడే అవకాశముంది. డీవోపీటీ విధించిన డెడ్ లైన్ కు అనుగుణంగా గురువారం లోగా అక్కడ జాయిన్ కావాల్సి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని గురువారం ఉదయమే అక్కడకు వెళ్లి సీఎస్ జవహర్ రెడ్డికి రిపోర్టు చేయనున్నట్టు సమాచారం.