ఏపీలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదంపై మాజీ మంత్రి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిని బీడు పెట్టాలనుకోవడం, గవర్నర్ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించడం దురదృష్టకరం..దుర్మార్గమన్నారు.
2014 ఎన్నికల్లో ప్రజాతీర్పు మేరకు చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. నిండు శాసనసభలో సభానాయకుడు, సీఎంగా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి రాజధానిగా అమరావతిని ఆమోదించారు. అమరావతికి జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీజేపీ సభ్యులు కూడా మద్దతు పలికారు. శాసనమండలిలో టీడీపీ, వైసీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు అమరావతికి అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేశాయి. ఇవన్నీ జరిగాక సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన చేశారు. అమరావతి మరో ఢిల్లీ కావాలని మోదీ ఆశీర్వదించారు. ఇంతమంది చెప్పాక నమ్మి 30 వేల మంది రైతులు చరిత్రలో నిలిచిపోయేలా 34 వేల ఎకరాలు త్యాగం చేయడం తప్పా. మంచి రాజధాని వస్తుందని ఉజ్వల భవిత ఉంటుందని నమ్మి వేల కోట్లు పెట్టుబడులు పెట్టిన పెట్టుబడిదారులది తప్పా. పది వేల కోట్ల ప్రజాధనం ఖర్చుపెట్టి లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన భవనాలను శిథిలాలుగా మార్చేస్తారా.ఇప్పటికే హౌసింగ్ ఫర్ ఆల్ కింద కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించిన 6 లక్షల ఇళ్లను పేదలకు చెందనీయకుండా బీడు పెట్టేశారు.కక్ష సాధింపులు పేదలపై చూపడం తగదు.
బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు కూడా బాధాకరం. అసెంబ్లీ, శాసనమండలిలో మీరు ఆమోదించి, ప్రధాన మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న రాజధాని ఇదని మరిచిపోకండి. ఓ వైపు అమరావతికి మద్దతు అంటారు..ఇంకో మూడు రాజధానులు ప్రభుత్వ ఇష్టమంటారు. ప్రజలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ కుంగిపోతుంటే..మరో వైపు ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా స్పందించరా.ఏపీలో జరుగుతున్న పరిణామాలను దేశమంతా గమనిస్తోంది. నిన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియమాకం విషయంలో జరిగిన అనేక పరిణామాలను కూడా చూశాం. రాజధాని విషయంలోనూ కోర్టుకు తెలియకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలున్నాయి…కానీ మీరు తీసేసుకుంటూ ముహూర్తాలు పెట్టేసుకుంటున్నారు. వెయ్యో, రెండు వేల కోట్లు ఖర్చుపెడితే పూర్తయ్యే రాజధానిని మార్చడం దురదృష్టకరం. రాజధాని విషయంలో మీ నిర్ణయం తప్పు…ప్రజాగ్రహానికి గురికాకతప్పదు. రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా రాజధాని మార్చొద్చు..కావాలంటే రెఫరెండం కోరండని పేర్కొన్నారు.