కూర మాడిందన్నందుకు తల్లిని సుత్తెతో కొట్టాడు ఓ కొడుకు. ఈ ఘటన మహబూబాబాద్ లో జరిగింది. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ మండలం వేంనూర్కు చెందిన ఇస్లావత్ మహేందర్, మున్సిపాలిటీలోని సాంక్రియతండాకు చెందిన నందిని ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.
మహేందర్, నందినిలు తల్లిదండ్రులతో కలిసి వేంనూర్లో ఉంటున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి భార్య నందిని, తల్లి బుజ్జిల మధ్య చిన్న చిన్న విషయాలకు గొడవలు జరుగుతున్నాయి.
శనివారం ఉదయం కోడలు నందిని కూర వండుతుండగా, అత్త కూర మాడిపోతుందని చూసుకోమని చెప్పింది. దీంతో నందిని, బుజ్జిల మధ్య గొడవ అయ్యింది. అదికాస్తా వాగ్వాదానికి దారి తీసింది.
ఈ క్రమంలో తల్లిపై సుత్తితో దాడి చేశాడు కొడుకు మహేందర్. ఇంట్లో ఉన్న సుత్తెతో తల్లి తలపై కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలైన తల్లిని మహబూబాబాద్ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.