దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న సోనియా గాంధీ.. మైసూరు జిల్లా హెచ్ డీ కోట అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ ఆలయంలో పూజలు చేశారు. కాగా రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు ఆమె కర్ణాటకకు వచ్చారు. దసరా ఉత్సవాల సందర్భంగా రాహుల్ పాదయాత్రకు రెండు రోజులు విరామం ప్రకటించారు.
బుధవారం పండుగ సందర్భంగా మైసూరు జిల్లా హెచ్ డీ కోట అసెంబ్లీ నియోజకవర్గంలోని భీమన్ కొల్లి ఆలయంలో దసరా పూజల్లో పాల్గొన్నారు. పూజల అనంతరం ఆలయంలో సోనియా కొద్దిసేపు గడిపారు. సోనియాకు వేద ఆశీర్వచనంతోపాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ప్రస్తుతం భారత్ జోడో యాత్ర కర్ణాటకలో సాగుతోంది. సెప్టెంబర్ 7న తమిళనాడు కన్యాకుమారి నుంచి ప్రారంభం అయిన విషయం తెలిసిందే. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో 21 రోజుల పాటు 511 కిలో మీటర్లు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు.
2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో భారత్ జోడో యాత్రను ప్రారంభించింది కాంగ్రెస్. మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల గుండూ పాదయాత్ర సాగుతుంది. 3750 కిలీమీటర్లు పాదయాత్ర జమ్మూకశ్మీర్ లో ముగియనుంది. ఐదు నెలల పాటు యాత్ర జరగనుంది. మరోవైపు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రస్తుతం ఈ పాదయాత్ర రాష్ట్రంలో అధికారాన్ని తీసుకువస్తుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.