ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం, సోనియా గాంధీ అధికారిక నివాసం సహా మరికొందరు కాంగ్రెస్ నేతలు ఉంటున్న భవనాలకు అనేక ఏళ్లుగా అద్దె చెల్లించడం లేదనే ఆరోపణలున్నాయి. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయ భవనం అద్దె బకాయి రూ.12,69,902 కాగా.. సోనియా గాంధీ అధికారిక నివాసం అద్దె బాకీ రూ.4,601తో పాటు.. రూ.5,07,911 ల సోనియా వ్యక్తిగత కార్యదర్శి నివాసం అద్దె బకాయి ఉన్నట్టు సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా తెలిసింది.
సుజిత్ పటేల్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా.. కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఢిల్లీ అక్బర్ రోడ్ లోని 26వ నెంబర్ భవనంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఉంది. 2012 డిసెంబర్ తర్వాత ఆ భవనం అద్దెను చెల్లించలేదని దరకాస్తులో పేర్కొనబడింది.
2020 జులైలో లోధి రోడ్ లోని ప్రభుత్వ భవనాన్ని నెల రోజుల్లోగా ఖాళీ చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కేంద్రం నోటీసులిచ్చింది. దీంతో ఆమె వేరే ఇంటికి మారాల్సి వచ్చింది. జనపథ్ రోడ్ లోని 10వ నెంబర్ ఇంట్లో ఉంటున్నారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. 2020 సెప్టెంబర్ నుంచి ఆ భవనం అద్దె చెల్లించలేదు. చాణక్యపురిలోని C-11/109 భవనంలో సోనియా వ్యక్తిగత కార్యదర్శి విన్సెంట్ జార్జ్ ఉంటున్నారు. ఆ భవనం అద్దెను 2013 ఆగస్టు నుంచి చెల్లించలేదు. మొత్తం బాకీ రూ.5,07,911 ఉన్నట్టు వెల్లడైంది.
జాతీయ, రాష్ట్ర పార్టీలకు ప్రభుత్వ భవనాల కేటాయింపుకు స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఆయా పార్టీలు సొంత భవనం కట్టుకునేందుకు మూడేళ్లు సమయం ఇస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ భవనాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. అయితే.. 2010 జూన్ లోనే ఢిల్లీ రౌజ్ ఎవెన్యూలో కాంగ్రెస్ పార్టీకి భూకేటాయింపు జరిగింది. అయినా.. భవన నిర్మాణం పూర్తి కాలేదు. 2013లో అక్బర్ రోడ్ కార్యాలయాన్ని కాంగ్రెస్ ఖాళీ చేయాల్సి ఉంది. అయితే.. అనేక సార్లు ఆ గడువు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరింది ఆ పార్టీ.
అయితే.. అద్దె బకాయిల వ్యవహారంపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ కు స్కాముల్లేవ్.. పైసల్లేవ్… ఎన్నికల్లో ఓడిపోయాక సోనియా గాంధీ అద్దె చెల్లించలేకపోతున్నారు. ఇప్పుడు కుంభకోణాలు చేయడానికి వీలు లేకపోవడమే ఇందుకు కారణమన్నది సుస్పష్టం. అయితే.. రాజకీయ భేదాభిప్రాయాలు పక్కనబెట్టి మానవత్వంతో నేను ఆమెకు సాయం చేయాలని అనుకుంటున్నా. అందుకే కార్యక్రమం ప్రారంభించి ఆమె ఖాతాకు రూ.10 బదిలీ చేశా. మీ అందరూ కూడా సాయం చేయాలని కోరుతున్నా” అని ట్వీట్ చేశారు బీజేపీ నేత తజిందర్ పాల్ సింగ్ బగ్గా.