ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ అంతరిక్ష పరిశోధనల్లో దూసుకెళ్తోంది. స్పేస్ ఎక్స్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఆరు నెలల కిందట చేపట్టిన రోదసి యాత్ర విజయవంతంగా ముగిసింది. నలుగురు వ్యోమగాములతో కూడిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ కాప్సూల్ గురువారం అర్ధరాత్రి దాటాక గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరంలో ల్యాండైంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్) నుంచి భూమికి పయనమైన 24 గంటల్లోపే ఈ డ్రాగన్ కాప్సూల్ గమ్యస్థానానికి చేరింది.
డ్రాగన్ ల్యాండ్ అయిన గంట తర్వాత క్యాప్సూల్ నుంచి నలుగురు ఆస్ట్రోనాట్లు బయటకు వచ్చారు. ఇందులో తెలుగు సంతతి వ్యోమగామి రాజాచారి కూడా ఉన్నారు. అంతేకాదు, రాజాచారి నాసా తరఫున ఈ యాత్రలో కమాండర్ హోదాలో పాల్గొన్నారు. ఆయనతో పాటు నాసా పైలెట్ థామస్ మార్ష్ బర్న్, మిషన్ స్పెషలిస్ట్ కైలా బారన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన మథియాస్ మౌరర్ కూడా భూమికి తిరిగి వచ్చారు. దీనికి సంబంధించిన చిత్రాలను నాసా విడుదల చేసింది.
స్పేస్ ఎక్స్ తన డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్యూల్ ద్వారా నలుగురు ఆస్ట్రోనాట్స్ ను ఇంటర్ నేషనల్ స్పేస్ స్టేషన్కు పంపించింది. ఒక్క నెలలో స్పేస్ ఎక్స్ చేసిన నాలుగో స్పేస్ ప్రయోగం ఇది. రెండు ప్రయోగాల్లో స్పేస్లోకి ఆస్ట్రోనాట్లను తీసుకెళ్లగా.. మరో రెండు ల్యాండింగ్ ప్రయోగాలను సక్సెస్ఫుల్గా ఎలాన్ మస్క్ సంస్థ నిర్వహించింది. మొత్తంగా 26 మందిని స్పేస్లోకి తీసుకెళ్లింది. అందులో 8 మంది ‘స్పేస్ టూరిస్టులే’ ఉన్నారు.
ఈ యాత్రకు కమాండర్గా వ్యవహరించిన రాజాచారి తెలుగు మూలాలున్న వ్యక్తి. ఆయన తండ్రి పేరు శ్రీనివాస్ చారి. రాజాచారి తాత మహబూబ్ నగర్ జిల్లా వాసి. రాజాచారి తండ్రి శ్రీనివాస్ చారి ఉస్మానియా వర్సిటీ నుంచి ఇంజినీరింగ్ చేసిన అనంతరం పైచదువుల కోసం అమెరికా వెళ్లారు. పెగ్గీ ఎగ్ బర్ట్ అనే యువతిని పెళ్లాడి అమెరికాలోనే స్థిరపడ్డారు.
రాజాచారి 1977 జూన్ 24న అమెరికాలోనే జన్మించారు. అక్కడే ప్రఖ్యాత మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్ సబ్జెక్టులతో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నారు. ఆపై అమెరికా నేవీ టెస్ట్ పైలెట్ స్కూల్లో శిక్షణ అనంతరం 2017లో నాసా ఆస్ట్రోనాట్ గా అవకాశం దక్కించుకున్నారు.