ఏపీలో కాపు రిజర్వేషన్ల కోసం భారీ ఉద్యమం కొనసాగింది. ఇదే అంశాన్ని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పెద్దల సభలో ప్రస్తావించారు. ఏపీలో కాపులు ఆర్థికంగా, సామాజికంగా, విద్య పరంగా వెనుకబడి ఉన్నారని అన్నారని అన్నారు. తమకు రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలని మూడు దశాబ్దాలుగా కాపులు ఉద్యమాలు చేశారని తెలిపారు.
రిజర్వేషన్ల కోసం వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే ఉందని.. అయినప్పటికీ బిల్లు ఆమోదం కోసం దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపారని ఆయన మండిపడ్డారు. ముస్లిం రిజర్వేషన్ బిల్లును సమ్మతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపలేదని అన్నారు. కాపుల బిల్లును మాత్రమే పంపాల్సిన అవసరం ఏందని జీవీఎల్ విమర్శించారు.
ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీలో 2017లో విద్యా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ బిల్లును పాస్ చేసినప్పటికీ.. రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు జీవీఎల్. కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లు పాస్ చేసిందని మండిపడ్డారు.
రిజర్వేషన్లను కల్పించాల్సిన బాధ్యతను కేంద్రంపై మోపాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. కాపులకు వెంటనే రిజర్వేషన్ అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే వైసీపీ ప్రభుత్వం కాపుల ఆగ్రహాన్ని చూడవలసి వస్తుందని హెచ్చిరించారు జీవీఎల్.