ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో వారంతా రాజకీయంగా చక్రం తిప్పిన వారే.. వారి వారి ప్రభుత్వంలో ప్రధాన శాఖలో మంత్రి పదవులు పొందిన వారే. కానీ ఇప్పుడు వారికి పదవులు లేకపోవడంతో రాజకీయంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నాగం, జూపల్లి, పూడపాటి చంద్రశేఖర్,లక్ష్మారె డ్డి. ఇందులో ఒక్క లక్ష్మారెడ్డి మినహాయిస్తే మిగతా వారెవ్వరు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవకపోవడంతో వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఐదు మంది మాజీ మంత్రులు ఇప్పుడు రాజకీయంగా గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో వారి వారి ప్రభుత్వంలో మంత్రి పదవులు పొంది చక్రం తిప్పిన ఈ ఐదుగురు మాజీ మంత్రులు ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వారే నాగం జనార్ధన్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పి. చంద్రశేఖర్, లక్ష్మారెడ్డీలు. ఇందులో ఒక్క లక్ష్మారెడ్డి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మిగతా వారు నాగం, జూపల్లి, పి. చంద్రశేఖర్ లు… పువ్వులు అమ్మిన చోటే కట్టెలు అమ్ముకుంటున్నారు అన్న చందంగా మారింది వారి పరిస్థితి.
నాగం జనార్ధన్రెడ్డి, పీ. చంద్రశేఖర్ ఇద్దరు ఉమ్మడి జిల్లాలో అత్యంత సీనియర్ నాయకులు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ ఇద్దరు మంత్రులుగా కొనసాగారు. గత అసెంబ్లీలో నాగం
జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. పి. చంద్రశేఖర్ మాత్రం టీడీపి ని వీడి మొదట టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అక్కడ టిక్కెట్ రాకపోవడంతో టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. అక్కడ కూడా పి.చంద్రశేఖర్ కు నిరాశే మిగిలింది. తర్వాత కమలం గూటికి చేరి ప్రస్తుతం ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. పి చంద్రశేఖర్ కు 2014, 2018 లో కూడా ఏ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో బీజేపి లో ఓ సీనియర్ నాయకుడిగా మాత్రమె కొనసాగుతున్నాడు. ఐతే ఉమ్మడి జిల్లాలోనే ఎంతో సీనియర్ నాయకులైన ఈ ఇద్దరి రాజకీయ బవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
ఇక కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా కొనసాగిన మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు,లు సైతం గడ్డుకాలాన్ని చవిచూస్తున్నారు. సొంత పార్టీని వీడి జూపల్లి టీఆర్ఎస్ లో, డికె అరుణ బీజేపి లో చేరారు. గత ఎన్నికల్లో ఇద్దరు ఓటమి చెందడంతో ఈ ఇద్దరి రాజకీయ భవిష్యత్తు తీవ్ర సంక్షోభంలో పడింది. ఇందులో జూపల్లి కృష్ణారావు పరిస్థితి అడకత్తెరలో పోకలా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినా.. అదిష్టానం మాత్రం జూపల్లిపై సస్పెన్షన్ వేటు వేయలేదు. దీంతో పార్టీలో కొనసాగాలా అన్న నిర్ణయాన్ని జూపల్లికే వదిలేసినట్టు కనిపిస్తుంది. దీంతో జూపల్లి పార్టీలో కొనసాగలేక, ఉండలేక తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నారు, దీంతో ఏమి చేయాలో తోచక కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. ఇటు మరో మాజీ మంత్రి డికె అరుణ సైతం గద్వాల అసెంబ్లీలో, మహబూబ్నగర్ పార్లమెంటులో పోటి చేసి రెండు మార్లు ఓటమి చెందారు. ఇటు బీజేపి రాష్ట్ర అద్యక్ష పదవి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నా, కమలం నేతలు కనికరించడం లేదని తెలుస్తుంది.
ఇక మిగిలిన ఒక్క మాజీ మంత్రి లక్ష్మారెడ్డిది అదే సమస్య. జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా… ఆయనకు మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురౌతున్నారు. ఉద్యమ నాయకుడిగా ముద్ర ఉన్న లక్ష్మారెడ్డికి.. కేసీఆర్ తన మంత్రి వర్గంలో మొండిచెయ్యి చూపించడంతో తీవ్ర అవమానంగా బావిస్తున్నారట. మొదటి విడత, రెండో విడతలోనూ మంత్రి పదవి రాకపోవడంతో తీవ్ర నిరాశతో కొన్ని రోజులపాటు తన కార్యకర్తలెవ్వరికీ అందుబాటులో లేకుండా పోయారు లక్ష్మారెడ్డి. దీంతో జడ్చర్ల నియోజకవర్గంలోని కారు గుర్తు కార్యకర్తలందరూ పనుల కోసం మంత్రి శ్రీనివాస్ గౌడ్ వద్దకు వెల్తుండటంతో కంగుతిన్న లక్ష్మారెడ్డి.. మళ్లీ నియోజకవర్గంపై దృష్టి సారించి అంతా చక్కదిద్దే పనిలో పడ్డారు. మొత్తానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నాగం, జూపల్లి, డికె అరుణ, పి. చంద్రశేఖర్, లక్ష్మారెడ్డీలు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారనేది జగమెరిగిన సత్యం.