మనిషికి మార్కులు వేసేది, సమాజంలో మార్పుతీసుకు వచ్చేది ప్రవర్తనే. ఏ పార్టీ వాళ్ళు ఎంత డబ్బిచ్చినప్పటికీ ప్రజలతో పద్ధతిగా మాట్లాడిన వాడికే ఓటు పడుతుంది. సేవా రంగంలోగానీ మరేచోటైనా మర్యాదనేది ఇచ్చిపుచ్చుకునే అతిగొప్ప మానసిక అంశం. డబ్బనే భౌతికాంశం ఎన్నదగినదే అయినప్పటికీ, దాని స్థానం మర్యాద తర్వాతే.
అందుకే బార్స్ లో తప్పతాగి తప్పుడుమాట మాట్లాడాడని టిప్పిచ్చిన వాణ్ణే తన్నుతుంటారు. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయమని మనదేశ జౌన్నత్యం మనకు ఉగ్గుపాలతో నేర్పింది. కానీ ఓవ్యక్తి పద్ధతి తప్పాడు. విమానంలోని మహిళా సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడు. సదరు ప్రయాణికుడిని స్పైస్జెట్..విమానం నుంచి దించివేసింది.
ఈ ఘటన ఢిల్లీ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయల్దేరాల్సిన ఎస్జి-8133 విమానంలో జరిగిన ఘటనపై క్రూ విభాగం ఉద్యోగిని రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. బోర్డింగ్ కు సిద్ధంగా ఉన్న విమానంలో తనపట్ల ఓ ప్రయాణికుడు, అతనితోపాటు ఉన్న మరో వ్యక్తి అసభ్యంగా వ్యవహరించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వారిద్దర్ని విమానం నుంచి దించివేసి ఢిల్లీ విమానాశ్రయ పోలీసు స్టేషన్ లో అప్పగించినట్టు ఎయిర్ లైన్స్ తెలిపింది.
ఆ తర్వాత ప్రయాణికుడు రాత పూర్వకంగా క్షమాపణలు చెప్పినా.. అతన్ని విమానం నుంచి దించేశారు. అనంతరం ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) తెలిపింది. కాగా సిబ్బందికి, ఇద్దరు ప్రయాణికులకు మధ్య జరిగిన గొడవకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.