తెలంగాణ అమరవీరుడు కాసోజు శ్రీకాంతచారి తండ్రి వెంకటాచారి (55) అదృశ్యం అయ్యారు. కొద్దిరోజులుగా వెంకటాచారి కనిపించట్లేదంటూ ఆయన భార్య శంకరమ్మ హయత్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. స్థానికంగా ఈ వార్త కలకలం రేపుతోంది. ఈ నెల 1న వెంకటాచారి పని నిమిత్తం ఇంటి నుంచి బయటకెళ్లారని… ఆ తర్వాత మళ్లీ తిరిగి రాలేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు శంకరమ్మ.
జూన్ 2న ఆయన సోషల్ మీడియాలో కనిపించారని.. బహుశా ఆయన ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ వద్ద ఉండొచ్చునని శంకరమ్మ అనుమానం వ్యక్తం చేశారు. శంకరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇటీవల వెంకటాచారి కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వెంకటాచారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వబోతున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు. శ్రీకాంతచారి బలిదానం చేసుకున్న డిసెంబర్ 3న భారీ సభ నిర్వహిస్తామని.. తెలంగాణ అసలైన ఆవిర్భావ దినోత్సవం అదేనని ప్రకటిస్తామన్నారు.
ఈ సందర్బంగా వెంకటాచారి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అమరవీరులను విస్మరిస్తోందని ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరులకు న్యాయం జరగాల్సి ఉందన్నారు. కేఏ పాల్ అమరవీరుల కుటుంబాలకు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చారని అన్నారు. తెలంగాణలో కేఏ పాల్ సారథ్యంలో ఉద్యమిస్తామని పేర్కొన్నారు.
ఆ తర్వాత వెంకటాచారి భార్య శంకరమ్మ కేఏ పాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి రాజ్యసభ సీటు ఇప్పిస్తానని ఒత్తిడి తెచ్చి వెంకటాచారిని పార్టీలో చేర్చుకున్నారని ఆరోపణలు చేశారు. ఖమ్మంకు చెందిన ఓ వ్యక్తితో ఇందుకోసం రాయబారం పంపారని అన్నారు. తన భర్తను కలిసేందుకు వెళ్తే.. ఆయన తనతో వచ్చేందుకు ఇష్టపడట్లేదని చెప్పి పాల్ మనుషులు నన్ను తిప్పి పంపించారని వాపోయారు. ఈ క్రమంలో వెంకటాచారి కనిపించకపోవడంతో అతను పాల్ వద్దనే ఉన్నట్టు ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు.