శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు గోటబయ రాజపక్ష కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటిదాకా తమ కుటుంబం అధికారం నుంచి తప్పుకునేది లేదని భీష్మించుకున్న రాజపక్ష.. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 11 పార్టీలతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో శ్రీలంకకు అతి త్వరలో కొత్త ప్రధాని రానున్నారు.
ఈ విషయాన్ని శ్రీలంక ఫ్రీడం పార్టీ అధినేత, ఎంపీ మైత్రిపాల సిరసేన మీడియాకు తెలిపారు. తాత్కాలిక సర్కార్ ఏర్పాటుకు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అంగీకరించారని, ఈ ప్రభుత్వంలో అన్ని పార్టీల భాగస్వామ్యం ఉంటుందని, కేబినెట్లో సుమారు 20 మంది సభ్యులు ఉంటారని ఆయన తెలిపారు. తాత్కాలిక ప్రభుత్వంలో ప్రధాని మహీంద రాజపక్స ఉండబోరని చెప్పారు.
అయితే, ప్రధానికి 117 మంది ఎంపీల మద్దతు ఉంది. కానీ శుక్రవారం నాటికి శ్రీలంకలో రాజకీయ పరిణామాలు మారిపోయినట్టు తెలుస్తోంది. మైత్రిపాల సిరిసేన నేతృత్వంలోని అసమ్మతి వాదుల ప్రతినిధి బృందం.. కొలంబోలోని భారత హై కమిషనర్ గోపాల్ బాగ్లేతో భేటీ అయింది. దేశంలోని తాజా పరిస్థితిని వారికి వివరించింది. ఈ నేపథ్యంలో ప్రెసిడెంట్ గోటబయ రాజపక్ష.. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 మంది ఎంపీల మద్దతును పొందడం ద్వారా మెజారిటీని చూపించాలని వారికి సూచించారు.
ఇక, ఈ భేటీ తర్వాత సిరిసేన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతిపాదిత మధ్యంతర ప్రభుత్వంలో తన అన్న మహింద రాజపక్స స్థానంలో కొత్త వ్యక్తిని ప్రధానిగా నియమించేందుకు గోటబయ రాజపక్స అంగీకారం తెలిపారు. దేశంలో ఆర్థిక సంక్షోభం కారణంగా ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు’ అని వివరించారు.
మరోవైపు, అఖిలపక్ష సర్కార్ ఏర్పాటుకు లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్షే నిర్ణయించినా ఎట్టిపరిస్థితిలోనూ రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న ప్రధాని మహేంద్ర రాజపక్సే ప్రకటించడం కీలకం మారింది. ఈ నేపథ్యంలో 11 పార్టీలతో కోత్త ప్రభుత్వం, కొత్త ప్రధాన మంత్రి, కొత్త కేబినెట్ రావడంపై సందిగ్దత నెలకొంది. తన వర్గం ఎంపీల కీలకసమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు మహేంద్ర రాజపక్సే.