తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయంలో శ్రీయాగం నిర్వ హించనున్నారు. మొత్తం ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగనుంది. జనవరి 21 నుంచి 27 వరకు యాగం జరగనుంది. కోవిడ్ 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో ఏకాంతంగా ఈ యాగం జరుగనుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. ప్రపంచ శాంతి, సౌభాగ్యం కోసం ఈ యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ యాగ కార్యక్రమాలను భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో వీక్షించవచ్చన్నారు.
జనవరి 21న మొదటిరోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు యాగశాలలో హోమాలు, చతుష్టానార్చన, అగ్ని ప్రతిష్ట, నిత్యపూర్ణాహుతి, నివేదన, వేద విన్నపం, మహామంగళహారతి నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు చతుష్టానార్చన, శ్రీయాగం హోమాలు, లఘుపూర్ణాహుతి, మహానివేదన, వేద విన్నపం, మహా మంగళ హారతి చేపట్టి.. అమ్మవారి ఉత్సవర్లను సన్నిధిలోకి వేంచేపు చేస్తారు.
జనవరి 22 నుండి 26 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీయాగం కార్యక్రమాలు నిర్వహిస్తారు. జనవరి 27న చివరి రోజుకావడంతో.. ఉదయం 6.30 గంటల నుండి 8.30 గంటల వరకు చతుష్టానార్చన, హోమాలు, మహాప్రాయశ్చిత్త హోమం, మహాశాంతి హోమం నిర్వహిస్తారు. ఉదయం 8.30 గంటల నుండి 9 గంటల వరకు మహాపూర్ణాహుతి చేపడతారు.
ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు అభిషేకం మరియు అవభృతం నిర్వహిస్తారు. జనవరి 20న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహించనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు ఆర్జిత సేవలు రద్దు చేస్తునట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. శ్రీ యాగం కారణంగా జనవరి 20 నుంచి 27 వరకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవను రద్దు చేయడం జరిగిందన్నారు. జనవరి 20, 21, 27వ తేదీల్లో బ్రేక్ దర్శనం రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అర్చకులు పి.శ్రీనివాసన్ ఈ యాగానికి ప్రధానాచార్యులుగా వ్యవహరిస్తారు.