సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టింది ఇస్రో. ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపిన ఘనత సొంతం చేసుకుంది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ నింగిలోకి దూసుకెళ్లింది ఎస్ఎస్ఎల్వీ డీ2 రాకెట్.
ఈ ప్రయోగం ద్వారా ఇస్రో రూపొందించిన 156.3 కిలోల బరువు గల భూ పరిశీలన ఉపగ్రహం EOS07, దేశీయ బాలికల ద్వారా స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ రూపొందించిన 8.7 కిలోల బరువు గల ఆజాదీ శాట్ 02 ఉపగ్రహం, అమెరికాలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల బరువు గల జానూస్ 01 ఉపగ్రహాన్ని రోదసీ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది ఇస్రో.
ఇప్పటికే ఎన్నో ప్రయోగాలతో అంతరిక్షంలో సత్తా చాటిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇవాళ చిన్ని ఉపగ్రహ వాహక నౌక ఎస్ఎస్ఎల్వీ డీ2 ప్రయోగాన్ని కూడా విజయవంతం చేసింది. ఎస్ఎస్ఎల్వీ డీ 2 కి శుక్రవారం తెల్లవారుజామున 2.48 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇది 6.30 గంటల పాటు కొనసాగి ఉదయం 9.18 గంటలకు షార్ లోని మొదటి ప్రయోగవేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లింది.
ఆ తర్వాత 13 నిమిషాల 2 సెకన్ల కాలంలో విజయవంతంగా అన్ని ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. గత ఏడాది ఆగష్టు 7న ప్రయోగాత్మకంగా నిర్మించి ప్రయోగించిన మొదటి ఎస్ఎస్ఎల్వీ రాకెట్ సాంకేతిక సమస్యల వల్ల సరైన కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశ పెట్టలేకపోయింది ఇస్రో.