డిజిటల్ ఇండియా కాన్సెప్ట్ ఎంతగా జనాలకు మేలు చేస్తుందో అంతే కీడు చేస్తుంది. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ప్రాచుర్యం పొందాక ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగాయి. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు సాంకేతికత అభివృద్ధి చేసుకుంటూ, మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారు. రోజుకు వేలల్లో ఆన్లైన్ ఫ్రాడ్స్ చోటు చేసుకుంటున్నాయి. అమాయకులనే కాకుండా అన్నీ తెలిసిన సెలబ్రిటీలను కూడా సులభంగా మోసం చేస్తున్నారు.
తాజాగా సీనియర్ హీరోయిన్ నగ్మా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి పెద్ద మొత్తంలో మోసపోయారు. తన ఫోన్ కి వచ్చిన ఒక మెసేజ్ క్లిక్ చేసి అడ్డంగా బుక్కయ్యారు. ఫిబ్రవరి 28న నగ్మా మొబైల్ కి బ్యాంకు వాళ్ళు పంపినట్లు ఒక మెసేజ్ వచ్చిందట. అందులో ఉన్న లింక్ ని నగ్మా క్లిక్ చేశారట. వెంటనే ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. బ్యాంకు ఎంప్లాయ్ గా పరిచయం చేసుకున్న మోసగాడు నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను… కే వై సి కంప్లీట్ చేయమన్నాడట.
నగ్మా ఎలాంటి బ్యాంకు డిటైల్స్ షేర్ చేయకున్నప్పటికీ నేరగాడు తన ఆన్లైన్ బ్యాంకు అకౌంట్ లోకి లాగిన్ అయ్యాడట. బెనిఫిషియరీ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాదాపు లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడట. నేరగాడు లాగిన్ అయ్యే క్రమంలో మల్టీఫుల్ అటెంప్ట్స్ చేశాడని, తన మొబైల్ కి అనేక ఓటీపీలు వచ్చాయని నగ్మా వెల్లడించారు. పెద్ద అమౌంట్ కాకుండా కేవలం లక్ష రూపాయలతో ఈ ఫ్రాడ్ నుండి బయటపడినందుకు నగ్మా బాధలో సంతోషం వ్యక్తం చేశారు.
నగ్మా అకౌంట్ నుండి ఒక నేషనల్ బ్యాంకుకి రూ. 99,998 ట్రాన్స్ఫర్ అయ్యాయి. నగ్మా కస్టమర్ గా ఉన్న సేమ్ బ్యాంకుకి చెందిన మరో 80 మంది కస్టమర్స్ ఇదే తరహాలో మోసపోయారట. సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్న లింక్స్ క్లిక్ చేయవద్దని, ఎలాంటి బ్యాంకు డీటెయిల్స్, ఓటీపీలు తెలియని వ్యక్తులతో పంచుకోవద్దంటున్నారు.
నగ్మా 90లలో టాప్ హీరోయిన్ గా ఉన్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్స్ తో నటించారు. తెలుగు, హిందీ భాషల్లో ఆమె అధికంగా చిత్రాలు చేస్తారు. జ్యోతికకు నగ్మా అక్క అవుతారు. ఇక 2004లో నగ్మా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున ఆమె క్రీయాశీలంగా ఉంటున్నారు. 2015లో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ సెక్రెటరీగా ఎంపికయ్యారు.