రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం కొనసాగుతుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వార్షిక బడ్జెట్ పై చర్చించి,ఆమోదం తెలుపనున్నారు. ఈ నెల 6న మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ కు బయలుదేరనున్నారు.
బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ వెలుపల నిర్వహిస్తున్న మొదటి బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. కాగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన మరుసటి రోజు అంటే ఈనెల 7 న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 8న బడ్జెట్ పై సాధారణ చర్చ జరగనుంది.
అదే రోజు ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమాధానం చెప్పనున్నారు. 9,10,11 తేదీల్లో పద్దుల పైన చర్చ జరగనుంది. వచ్చే ఆదివారం అంటే ఈ నెల 12న సభలో ప్రభుత్వం ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెట్టనుంది. అదే రోజు చర్చ బిల్లుకు సభ ఆమోదం తెలపనుంది. దీంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.
అయితే ప్రతిపక్షాలు మాత్రం ప్రజాసమస్యలను చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలను కనీసం 25 రోజుల పాటు నడిపించాలని పట్టుబడుతున్నాయి. అసలు ప్రతిపక్షాలను కేసీఆర్ సర్కార్ ఏమాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదని మండిపడుతున్నాయి.