పట్టణాల్లో పశువులు ప్రధాన రహదారులపైనే సంచరిస్తుంటాయి. కొంత మంది వాటిని రోడ్డుపై వదిలేయడంతో అక్కడే అవి సేద తీరుతుంటాయి. కొన్నిసార్లు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కూడా కలుగజేస్తాయి. ఈ క్రమంలోనే గుజరాత్ ప్రభుత్వం రోడ్లపై సంచరించే పశువుల నియంత్రణకు ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టింది. సాయంత్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు అర్ధరాత్రి ఆమోదం లభించింది.
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల వీధుల్లో గోవులు, మేకలు మొదలైన పశువులు సంచరిస్తుండటంపై ఆంక్షలు విధించింది గుజరాత్ ప్రభుత్వం. ఈ మేరకు “గుజరాత్ క్యాటిల్ కంట్రోల్ అర్బన్ ఏరియాస్ బిల్” పేరుతో బిల్లును రూపొందించింది. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లో పశువులు సంచరించడాన్ని కట్టడి చేయాలని ప్రభుత్వం భావించింది.
నగరాల్లో పశువులను ఉంచాలంటే సంబంధిత యజమానులు అందుకు లైసెన్స్లు పొందాలని బిల్లులో పేర్కొంది ప్రభుత్వం. లైసెన్స్ పొందిన 15 రోజుల్లోగా పశువును గుర్తించేందుకు వీలుగా ట్యాగ్ జత చేయాలని స్పష్టం చేసింది. లేనిచో యజమానికి ఏడాది జైలు శిక్ష లేదా రూ.10 వేల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉందని తెలిపింది. అయితే, ఈ బిల్లును తయారు చేసింది అక్కడి ప్రభుత్వం. అయితే దీనిని నల్ల చట్టంగా అభివర్ణించాయి ప్రతిపక్షాలు.
ఈ బిల్లు ఉల్లంఘనలకు పాల్పడే వారికి కఠిన శిక్ష విధిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అలాగే, అధికారులు పశువులు స్వాధీనం చేసుకునే సమయంలో వారిపై దాడికి పాల్పడితే ఏడాది జైలు శిక్షతో పాటు రూ.50వేల జరిమానాను విధించనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న ట్యాగ్ లేని పశువులను యజమానులు తిరిగి తీసుకోవాలంటే రూ.50వేల జరిమానా చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ బిల్లుపై గురువారం సాయంత్రం 6 గంటలకు మొదలైన చర్చ సుమారు ఏడు గంటల పాటు సాగింది. అర్ధరాత్రి సుమారు 1 గంటకు బిల్లు ఆమోదం పొందింది.
“పశువులు వీధుల్లో తిరగడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పశువులను స్వాధీనం చేసుకుని యజమానులకు అప్పగించినా వారు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. వాటిని మళ్లీ వీధుల్లో వదిలేస్తున్నారు. అందుకే ఈ బిల్లును ప్రవేశపెడుతున్నాము” అని మంత్రి వినోద్ మోరాదియా వెల్లడించారు. అహ్మదాబాద్, రాజ్కోట్, వడోదరా సహా 156 ప్రాంతాలు ఈ బిల్లు పరిధిలోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.