పదో తరగతి విద్యార్థినిపై హత్యాచారం కేసులో ఏపీ సర్కార్ సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఇచ్చిన జీవోపై తల్లితండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. 2017లో కర్నూలు జిల్లాలో పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతిబాయి హత్యాచారం జరిగింది. ప్రీతిబాయి హత్యాచారం కేసును సీబీఐకి అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం గతంలో జీవో జారీ చేసింది.
అయితే ప్రభుత్వం జీవో ఇచ్చి 8 నెలలు గడుస్తున్నా కేసులో సీబీఐ విచారణకు స్వీకరించకపోవడంతో ప్రీతిబాయి తల్లిదండ్రులు జనసేన పార్టీ నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లి సీబీఐ కార్యాలయంలో సంప్రదించారు. సీబీఐ అధికారులు ఇచ్చిన సమాధానంతో వారు షాక్ అయ్యారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎందుకూ పనికిరాదంటూ సీబీఐ అధికారులు చెప్పారంటూ ప్రీతిబాయి తల్లి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం ఫేక్ జీవో ఇచ్చిందంటూ.. ఆ జీవో ప్రతులను చించివేశారు.
న్యాయం కోసం ఆందోళనలతో పాటు న్యాయపోరాటం చేస్తామని పార్వతి తెలిపారు.