రోజురోజుకి భారతదేశం ముందుకు వెళ్తోంది. ఎందులోనో తెలుసా? ఆత్మహత్యల్లో. అవును భారతదేశంలో రోజురోజుకి ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. దేశంలో ఏటా 1.63 లక్షల మంది ప్రాణాలు తీసుకుంటున్నట్లు ఓ నివేదికలో తేలింది. కుటుంబ, ఆరోగ్య, ఆర్థిక సమస్యలు ఉసురు తీస్తున్నాయి.
ప్రమాదకరమైన టీబీ కంటే ఎక్కువగా ఆత్మహత్యల వల్లే దేశంలో ఎక్కువమంది మరణిస్తున్నట్టు జాతీయ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదికలు చెబుతున్నాయి. దేశంలో ఏటా 1.63 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఎన్సీఆర్బీ చెబుతోంది. అయితే.. వాస్తవ సంఖ్య 1.90 లక్షలకు పైగానే ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుండగా…గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ మాత్రం ఈ సంఖ్యను 2.30 లక్షలుగా పేర్కొంది.
దేశంలో ప్రతి ఏడాది పెద్ద ఎత్తున ఆత్మహత్యలు జరుగుతున్నా కూడా.. ప్రభుత్వాలు పట్టనట్టు వ్యవహరిస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యల్లో గతంలో చైనా అగ్రస్థానంలో ఉండేదని, ఇప్పుడా స్థానాన్ని భారత్ ఆక్రమించిందని అంటున్నారు. దేశంలో ఆత్మహత్యల సంఖ్య పెరిగిందన్న ఇందుకు కొవిడ్ కూడా ఒక కారణమని వివరిస్తున్నారు.
ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలోనే ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నట్టు తేలింది. పుదుచ్చేరిలో దేశంలోనే అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణలో 26.9 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 15.3శాతం సూసైడ్స్ జరుగుతున్నాయి. దేశంలో 33.2 శాతం ఆత్మహత్యలకు కుటుంబ సమస్యలే కారణమని ఎన్సీఆర్బీ గణాంకాలు చెబుతున్నాయి.