తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 316 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఆదివారం కావడంతో తక్కువ టెస్టులు( 32,714) నిర్వహించడంతో కేసుల సంఖ్యలో ఇలా తగ్గుదుల కనిపించింది.తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 86, రంగారెడ్డి జిల్లా- 30, మేడ్చల్ మల్కాజ్గిరి- 22, కరీంనగర్- 18, సంగారెడ్డి- 14 నమోదయ్యాయి.
వైరస్ ప్రభావంతో నిన్న మరో ఇద్దరు మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 1515కు పెరిగింది. ఇక రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,730కి చేరింది. తాజాగా కరోనా నుంచి 612 మంది కోలుకోగా.. మొత్తం 2,73,625 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6590 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 64.75 లక్షల మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.