వీకెండ్ వచ్చిందంటే చాలు ప్రజలకు ముక్కలేనిదే ముద్ద దిగట్లేదనుకోవచ్చు. పభ్లిక్ నాడిని కనిపెట్టిన దళారులు మాంసాన్ని వీకెండ్ లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇక ఏదైనా పండగ వచ్చిందంటే చాలు దళారులు పెంచే రేట్లకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. సంక్రాంతి సందర్భంగా రాష్ట్రంలో మాంసాహారానికి భారీ డిమాండ్ ఏర్పడింది. గొర్రెలు, మేకల మాంసం రికార్డుస్థాయిలో అమ్ముడు పోతోంది. ఆదివారం కిలో రూ.800 నుంచి రూ. 950 వరకు అమ్ముడుపోయింది. మూడేళ్ల క్రితం కిలో ధర రూ.400 నుంచి రూ. 500 వరకు ఉండేది.
ఇప్పుడు దానికి రెట్టింపు అయింది. ఇటు ఈ మూడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల సంఖ్య 2 కోట్లను దాటినట్టు తెలుస్తోంది. దీంట్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని పశుసంవర్ధకశాఖ తెలిపింది. రాష్ట్రంలో గొర్రెల సంఖ్య భారీగా పెరిగినా.. ధర తగ్గాల్సింది పోయి, ఏకంగా రెట్టింపయింది. సంక్రాంతికి ప్రత్యేకించి కనుమ పండగ సందర్భంగా మాంసాహారం తినడం కొన్ని వర్గాల ప్రజలకు ఆనవాయితీ. అందులో భాగంగా ఆదివారం రాష్ట్రంలో మాంసం విక్రయాలు గరిష్ఠస్థాయికి చేరాయి.
గ్రేటర్ హైదరాబాద్ లో ఆదివారం ఒక్కరోజే 10 వేల గొర్రెలు, మేకలకు పైగా కోసి మాంసం విక్రయించారని టోకు వ్యాపారి ఒకరు చెప్పారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి లారీలు, వ్యాన్లలో మేకలు, గొర్రెలను పెద్దసంఖ్యలో తెచ్చి విక్రయించారు. వాటి రవాణాకు కిరాయిలు పెరిగినందున.. అధిక ధరలకు జీవాలను విక్రయిస్తున్నారు. అందుకే మాంసం ధరను పెంచినట్లు దిల్సుఖ్ నగర్ కు చెందిన ఓ చిల్లర వ్యాపారి స్పష్టం చేశారు. గత ఏడాది కరోనా వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి గొర్రెలు, మేకల ధరలకు రెక్కలొచ్చాయి. వాటికి వేసే దాణా, గ్రాసం ధరలు, రవాణా కిరాయిలు 30 శాతం దాకా పెరిగాయి.
అంతర్జాతీయ మార్కెట్ లో కిలో మాంసం ధర రూ.514కి పలికిందని జాతీయ వ్యవసాయ, శుద్ధిచేసిన ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి మండలి తాజా నివేదికలో కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. ధర ఇంతకు మించితే విదేశీ మార్కెట్లలో భారత మాంసాన్ని కొనడం లేదు. కానీ.. హైదరాబాద్ మార్కెట్ లో ఏకంగా రూ.800 నుంచి రూ. 950 కి అమ్ముతుండటం గమనార్హం. దాణాఖర్చులు బాగా పెరగడంతో పాటు రాష్ట్రంలో జీవాల కొరత ఉన్నందున మాంసం ధరలు పెరుగుతున్నాయని రాష్ట్ర గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం అధ్యక్షుడు ఉడుత రవీందర్ తెలిపారు. మేకలు, గొర్రెల పెంపకందారులు కబేళాలకు ఎంతకు అమ్ముతున్నారనే అంశంపై పశుసంవర్ధకశాఖ, సమాఖ్య కలసి అధ్యయనం చేశాయి. కిలో ధర రూ.700కి మించి అమ్మకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరింది.