నటుడిగా రజనీకాంత్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. ఎంతో కష్టపడి తమిళ సినిమాతో పాటు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అశేష అభిమానులను సంపాదించుకున్న ఏకైక నటుడు తలైవా. చాలామంది సీనియర్ నటులు సినిమాలనుండి రాజకీయాలవైపు వస్తుండడంతో రజిని కూడా ఆమధ్య రాజకీయాల్లోకి వస్తున్నాడనే చర్చ జరిగింది.
అందుకు తగ్గట్టుగానే ‘రజనీ మక్కల్ మంద్రం’ అనే పార్టీని కూడా స్థాపించాడు. అయితే పార్టీ పెట్టిన కొద్ది రోజులకే ఆ పార్టీని మూసేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు ఇలా జరిగిందనే చర్చకూడ అభిమానుల్లో కలిగింది. అయితే అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాల్లోకి రావడం లేదంటూ మూడు పేజీల స్టేట్మెంట్ ని రజిని గతంలోనే విడుదల చేశారు.
తాజాగా మరోసారి తన రాజకీయం పై స్పందించారు. మూత్రపిండాల సమస్య చికిత్స సమయంలో రాజకీయాలపై నిర్ణయం తీసుకున్నా.. డాక్టర్ రాజన్ రవిచంద్రన్ సలహా మేరకు కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనకూడదని నిర్ణయించుకున్నా.. మూత్ర పిండాల సమస్యతోనే రాజకీయాలకు దూరం అయ్యానని వివరించారు. అలాగే దేవుడు లేడు అనీ కొందరు అంటుంటే ఏమనాలో అర్థం కావడం లేదని అన్నారు.
అలాంటివారు రక్తం తయారు చేయగలరా అని ప్రశ్నించారు. రజిని రాజకీయాల్లోకి రాకూడదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పారన్నారు. అందుకే పలు ఆరోగ్య సమస్యల వల్ల రాజకీయాల్లోకి రాలేకపోయానని స్పష్టం చేశారు.