పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు సర్వోన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్టులో 7.15 టీఎంసీల వరకు పనులు కొనసాగించుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతులు ఇచ్చింది. పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్లతో కూడిన ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది.
supr
ప్రజలు తాగునీటి సమస్యను ఎదుర్కోకూడదన్న ఉద్దేశంతోనే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. పర్యావరణ అనుమతులు 7.15 టీఎంసీల ఉపయోగించుకునేందుకు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటిని కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకు కోవాలని ఆదేశించింది.
ఈ కేసులో మెరిట్స్ కు అనుగుణంగా తగిన నిర్ణయాలు ఉంటాయని పేర్కొంది. మరోవైపు ప్రాజెక్టు పై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) విధించిన జరిమానాపై కూడా ధర్మాసనం స్టే ఇచ్చింది. అంతకు ముందు ప్రాజెక్టు నిర్మాణ విషయంలో పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారని చెబుతూ ఎన్జీటీ రూ. 500 కోట్ల జరిమానా విధించింది.
ఆ నిర్ణయంపై సుప్రీం కోర్టును తెలంగాణ సర్కార్ ఆశ్రయించింది. దీంతో ఈ రోజు విచారణ చేపట్టిన ధర్మాసనం… ప్రజల తాగునీటి అవసరాలకు అనుగుణంగా 7.15 టీఎంసీల నీటి వరకు మాత్రమే పనులకు అనుమతిని ఇచ్చింది. ఈ కేసులో ప్రతి వాదులందరికీ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.
దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రతి వాదులకు న్యాయస్థానం ఆరు వారాల గడువు ఇచ్చింది. ఆ తర్వాత వాటిపై ఆరు వారాల్లో రిజాయిండర్లు దాఖలుకు పిటిషనర్ను ధర్మాసనం ఆదేశించింది. కేసు తదుపరి విచారణను అగస్టులో చేపట్టనున్నట్లు వెల్లడించింది.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి గత నెలలో సుప్రీంకోర్టు మెట్లెక్కారు. దీంతో పిటిషనర్ వాదనలను వినాలంటూ న్యాయస్థానం సూచించింది. దీంతో ద్విసభ్య ధర్మాసనం పిటిషన్ పై తీర్పును రెండు వారాలకు వాయిదా వేసింది. ఆ తీర్పు రాక ముందే తాజాగా సుప్రీంకోర్టు పాలమూరు-రంగారెడ్డికి అనుమతులు ఇవ్వడం గమనార్హం.