ఏపీకి చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఎఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనంలో విచారణ చేపట్టగా… ఏడాది నుంచి సస్పెన్షన్ పొడిగింపుపై సర్వీస్ నిబంధనలు చూపించాలని ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
అఖిల భారత సర్వీసు నిబంధనల్లోని రూల్ 3లో 1-సీ కింద సస్పెన్షన్ పొడిగించామని ఏపీ ప్రభుత్వం కోర్టుకు తెలపగా, రివ్యూ కమిటీ నిర్ణయం ప్రకారం ఆరు నెలల తర్వాత సస్పెన్షన్ పొడింగించినట్లు వెల్లడించింది. ఏబీ వెంకటేశ్వరరావుపై అవినీతి చార్జ్ లేదని.. రూల్ 3లోని 1-బీ ప్రకారం ఏడాది కంటే ఎక్కువ సస్పెన్షన్ ఉండటానికి వీల్లేదని ఏబీ వెంకటేశ్వరరావు తరపు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.
అలా అయితే… సస్పెన్షన్ పొడిగించిన రివ్యూ కమిటీ ఆదేశాలను ఎందుకు సవాలు చేయలేదని ఏబీ వెంకటేశ్వరరావు తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సస్పెన్షన్ పొడిగిస్తూ రివ్యూ కమిటీ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేసేందుకు మూడు రోజుల గడువు కోరగా, కోర్టు అనుమతి ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు వేసే అప్లికేషన్ పై ఆ తర్వాతి మూడు రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ… తదుపరి విచారణను మార్చి 9కి వాయిదా వేసింది.