కరోన బారిన పడిన రోగుల ఇళ్ల బయట పోస్టర్లు, ఇతర సంకేతాలు ఏవీ అంటించొద్దని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంపై కేంద్ర మార్గదర్శకాలను పరిశీలించిన ప్రత్యేక కేసుల విషయంలో విపత్తు నిర్వహణ చట్టం కింద సంబంధిత అధికారులు ప్రత్యేకంగా ఆదేశాలు ఇస్తే మాత్రం అంటించొచ్చని అభిప్రాయపడింది.
కరోనా రోగుల ఇళ్ల బయట పోస్టర్లు అంటించటంతోఅంటరాని వారిగా చూస్తున్నారని, ఈ పోస్టర్లు అంటించటాన్ని ఆపాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశంపై ఇప్పటికే కేంద్రం మార్గదర్శకాలను విడుదల చేసిందని, కాబట్టి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అలాంటి పోస్టర్లు అంటించొద్దని స్పష్టం చేసింది.
కరోనా రోగుల ఇళ్ల బయట పోస్టర్లు అంటించటంపై తమ మార్గదర్శకాల్లో ఎలాంటి సూచనలు లేవని కేంద్రం ఇప్పటికే కోర్టుకు తెలిపింది. ఇందులో ఎవరినీ కించపరిచే ఆలోచన తమకు లేదని తేల్చిచెప్పింది.